ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణానికి విదేశీ ఇన్వెస్టర్లు తోడవడంతో షేర్ మార్కెట్లో రికార్డులు బద్దలవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఆల్టైం హై పాయింట్లను టచ్ చేశాయి.
బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,641 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మొదలు పెట్టడంతో వరుసగా పాయింట్లు లాభపడుతూ పోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో 54,874 పాయింట్లను టచ్ చేసింది. చాలా సేపు అక్కడే కొనసాగింది. ఇక మార్కెట్ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా కొద్దిగా నెమ్మదించింది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 54,843 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీలోనూ ఇదే జోరు కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి 83 పాయింట్లు లాభపడి 16,364 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా నిఫ్టీ ఆల్టైం హై పాయింట్లు సాధించింది.