హైబ్రిడ్‌ మోడళ్లపైనే టయోటా ఫోకస్‌

26 Nov, 2022 10:51 IST|Sakshi

ముంబై: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను భవిష్యత్తులో ప్రవేశపెడతాం. ప్రస్తుతానికి హైబ్రిడ్‌ మోడళ్లపైనే టయోటా కిర్లోస్కర్‌ ఫోకస్‌ చేసిందని కంపెనీ వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో హైబ్రిడ్లపై దృష్టిసారించారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘కర్బన ఉద్గారాలను తగ్గించడమే దేశ లక్ష్యం అని నేను భావిస్తున్నాను.

మీరు దానిని సమగ్రంగా, శాస్త్రీయ ప్రాతిపదికన చూడాలి. అదే మేము చేస్తున్నాము’ అని చెప్పారు.  సమీప కాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పునరుత్పాదక విద్యుత్తు వాటా కనీసం 50–60 శాతానికి చేరితే తప్పనిసరిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను పరిచయం చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నోవా హైక్రాస్‌ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ఇవీ ఇన్నోవా హైక్రాస్‌ ఫీచర్లు.. 
మల్టీ పర్పస్‌ వెహికల్‌ ఇన్నోవా ప్లాట్‌ఫామ్‌పై హైక్రాస్‌ పేరుతో హైబ్రిడ్‌ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. బుకింగ్స్‌ మొదలయ్యాయి. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయి. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తోనూ లభిస్తుంది. సెల్ఫ్‌ చార్జింగ్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌తో 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిజన్‌ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 21.1 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది.

డైనమిక్‌ రాడార్‌ క్రూజ్‌ కంట్రోల్, ప్రీ కొలీషన్‌ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ–డ్రైవ్‌ సీక్వెన్షియల్‌ షిఫ్ట్‌ సిస్టమ్, 7–8 సీట్లు, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ జోడించారు.  ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవా వాహనాలు 26 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2005లో భారత్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు ఇన్నోవాలు రోడ్డెక్కాయి. కంపెనీ మొత్తం అమ్మ కాల్లో ఈ మోడల్‌ వాటా ఏకంగా 50 శాతం ఉంది.

చదవండి: బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!


   

మరిన్ని వార్తలు