ఆటోమొబైల్ కంపెనీలకు భారీగా ‘పీఎల్‌ఐ’ ప్రోత్సాహకాలు

16 Mar, 2022 21:24 IST|Sakshi

లిస్టులో మారుతీ, హీరో మోటోకార్ప్‌, టాటా కమిన్స్, టయోటా కిర్లోస్కర్‌

న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా.. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగం కోసం ప్రకటించిన ఉత్పాదకత ఆధార ప్రోత్సాహకా(పీఎల్‌ఐ) పథకం కింద 75 సంస్థలకు ప్రయోజనాలు లభించనున్నాయి. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, లూకాస్‌-టీవీఎస్, టాటా కమిన్స్, టయోటా కిర్లోస్కర్‌ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశీ కంపెనీలతో పాటు జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల సంస్థలు కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. పీఎల్‌ఐ స్కీములో అంతర్భాగమైన రెండు పథకాల ద్వారా అయిదేళ్లలో రూ. 74,850 కోట్ల మేర పెట్టుబడులు రానున్నట్లు పేర్కొంది. 

కాంపోనెంట్‌ చాంపియన్‌ ఇన్వెస్టివ్‌ స్కీము కింద దాదాపు రూ. 29,834 కోట్లు, చాంపియన్‌ ఓఈఎం ఇన్సెంటివ్‌ స్కీము కింద రూ. 45,016 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.42,500 కోట్ల లక్ష్యం కన్నా ఇది అధికమని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఓఈఎం స్కీము కింద ఇప్పటికే 20 సంస్థలు ఎంపికయ్యాయి. ‘ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా భారత్‌ సాధిస్తున్న పురోగతిపై పరిశ్రమ గట్టి నమ్మకంతో ఉందని ఈ పథకాలకు లభించిన స్పందన తెలియజేస్తోంది.

(చదవండి: ఐఫోన్ 13పై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..!)


 

మరిన్ని వార్తలు