టిక్‌టాక్‌ యూజర్లకు శుభవార్త..! సరికొత్తగా..

21 Jul, 2021 16:12 IST|Sakshi

భారత్‌-చైనా మధ్య భీకర పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన సుమారు 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అందులో పబ్జీ, టిక్‌టాక్‌ వంటి యాప్‌లు ఉండడం గమనార్హం. భారత్‌లో ఉన్న యూజర్ల నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోకుండా ఉండేందుకు ఇప్పటికే క్రాఫ్టన్‌ గేమ్స్‌ పబ్జీను తిరిగి బీజీఎమ్‌ఐ రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరో యాప్‌ టిక్‌టాక్‌ తిరిగి భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టిక్‌టాక్‌ మాతృక సంస్థ బైట్‌డాన్స్‌ భారత్‌లోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా బైట్‌డాన్స్‌ టిక్‌టాక్‌ స్థానంలో..TickTockను రిలీజ్‌ చేయనుంది.

బైట్‌డాన్స్‌ TickTock పేరుతో కొత్త ట్రేడ్‌మార్క్‌ అప్లికేషన్‌ను జూలై 7 న దాఖలు చేసినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఈ నెల ప్రారంభంలో టిక్‌టాక్ కోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ కమిషన్‌కు కొత్త ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసినట్లు టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటివరకు సంస్థ ఈ విషయంపై అధికారికంగా ధృవీకరించలేదు.

దేశ భద్రతా విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు చైనీస్‌ యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ నిషేధంతో స్నాప్‌ చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ రీల్స్‌ పేరిట షార్ట్‌ వీడియోలను యూజర్లకు అందుబాటులో తెచ్చాయి. భారత్‌లో టిక్‌టాక్‌పై  పూర్తి నిషేధం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తుల్లో  ప్రాచుర్యాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ యాప్‌ను సుమారు మూడు బిలియన్లకు పైగా యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు