నిత్యవసర వస్తువులపై తగ్గిన జీఎస్టీ.. అమలు చేయని వ్యాపారస్తులు

25 Jan, 2023 11:24 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీఎస్టీ అమలుతో నిత్యావసరాల ధరలు తగ్గి...వినియోగదారుడిపై భారం తగ్గుతుందని భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. జీఎస్టీ అమలు నుంచి నేటి వరకు దాదాపు 210 నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించారు. జీఎస్టీ ప్రారంభంలో పలు వస్తువులపై 28 శాతం ఉన్న పన్నును.. ప్రస్తుతం 18 శాతానికి, 18 శాతం పన్ను ఉన్న వస్తువులకు 12 శాతానికి తగ్గించారు. గతేడాది 12 శాతం పన్ను పరిధిలో వచ్చే నిత్యావసర వస్తువుల పన్నును 5 శాతానికి తగ్గించారు. కానీ వ్యాపారులు తగ్గిన పన్నుల ప్రకారం నిత్యావసర వస్తువులను విక్రయించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.   

►పన్ను తగ్గించినా వినియోగదారుడికి ప్రయోజ­నం లేకుండా పోయింది. మరోవైపు తగ్గిన పన్ను­ను వ్యాపారులు ధరల్లో కలుపుకొని విక్రయిస్తు­న్నారు. దీంతో వినియోగదారుడికి 
లబ్ధి చేకూరడం లేదు.

 ►పన్ను తగ్గించినా ఇప్పటికే పాత ధరల్లోనే వస్తువులు మార్కెట్‌లో అందుబాటులో ఉంచారు. పన్నులు తగ్గినట్లు ధరలు కూడా తగ్గాయా లేదా? ధరలు యథాతథంగా వ్యాపారులు విక్రయిస్తున్నారా? అవే విషయాలను పర్యవేక్షించడానికి యాంటీ ప్రాఫెటింగ్‌ కమిటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ కమిటీ పర్యవేక్షణ కొరవడటంతో పన్ను తగ్గించకుండా వస్తువులు విక్రయిస్తూ అక్రమాలకు పాలుపడుతున్నారు.

28 నుంచి 18 శాతానికి తగ్గిన పన్ను
జీఎస్టీ ప్రారంభంలో 28 శాతం పన్ను రేటు ఎక్కువగా ఉన్న వస్తువులపై వ్యాపారులు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన  ఆధారంగా జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించి చాలా వస్తువులకు 18 శాతం పన్ను పరిధిలోకి మార్చారు. 

► గతేడాది మరికొన్ని 18–12 శాతానికి, 12–5 శాతానికి తగ్గించారు.  దీని ద్వారా వినియోగదారుడికి ఎంతో ఉపశమం కలుగుతుందని భావించారు. కానీ పన్ను రేటు తగ్గిచడంతో కలిగే భారాన్ని వినియోగదారునికి బదలాయించక పోతే అది నేరంగా పరిగణించబడుతుంది. 

►దీన్ని పర్యవేక్షించడానికి కమిటీలు ఏర్పాటు చేశారు. పన్ను తగ్గించడం వల్ల కలిగిన లాభాన్ని తమకు ఇవ్వడం లేదని వినియోగదారుడు వ్యాపారస్తులపై కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. 

►తగ్గిన పన్ను ప్రకారం ధరలు తగ్గించకుండా అసలు ధరలో కలిపేసి అమ్ముతున్నారు. 
దీంతో తగ్గిన జీఎస్టీ వినియోగదారుడికి అందడం లేదు. ఎక్కువ పన్ను రేటు ఉన్నప్పుడు ఉన్న ధర తక్కువ పన్ను భారాన్ని వ్యాపారస్తులు వినియోదారుడికి బదలాయించాలి.  

 ►లేని పక్షంలో దీన్ని నేరంగా పరిగణించి వ్యతిరేక లాభం కమిటీ విచారణ జరిపి కేసులు నమోదు చేస్తోంది. 

మరిన్ని వార్తలు