సర్వీసుల నాణ్యతను పెంచాలి.. టెలికం కంపెనీలకు ట్రాయ్‌ చీఫ్‌ సలహా

18 Feb, 2023 10:56 IST|Sakshi

న్యూఢిల్లీ: సర్వీసుల నాణ్యతను, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మరింతగా మెరుగుపర్చాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చీఫ్‌ పి.డి. వాఘేలా టెలికం సంస్థలకు సూచించారు. అలాగే కాల్‌ అంతరాయాలు, సర్వీసుల నాణ్యతకు సంబంధించిన గణాంకాలను రాష్ట్రాల స్థాయిలో కూడా వెల్లడించాలని పేర్కొన్నారు.

సర్వీసుల నాణ్యతను సమీక్షించేందుకు శుక్రవారం రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా తదితర టెల్కోలతో వాఘేలా సమావేశమయ్యారు. కాల్‌ డ్రాప్స్‌ను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆపరేటర్లకు ఆయన సూచించారు.

సర్వీస్‌ నాణ్యతా ప్రమాణాలను మరింతగా కఠినతరం చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు వాఘేలా తెలిపారు. కాల్‌ డ్రాప్‌ డేటాను రాష్ట్రాల స్థాయిలో కూడా సమీక్షించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎల్‌ఎస్‌ఏ (లైసెన్స్‌డ్‌ సర్వీస్‌ ఏరియా)వారీగా, సగటున మూడు నెలలకోసారి ఈ డేటాను సేకరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు