వోడాఫోన్‌ వర్సెస్‌ జియో.. ట్రాయ్‌ కీలక ఆదేశాలు

8 Dec, 2021 08:21 IST|Sakshi

పోర్టింగ్‌కు ఎస్‌ఎంఎస్‌ సర్వీసు ఇవ్వాల్సిందే

టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశం  

న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే (పోర్టింగ్‌) యూజర్లకు టారిఫ్‌ వోచరు, ప్లాన్లతో సంబంధం లేకుండా ఎస్‌ఎంఎస్‌ సదుపాయాన్ని తక్షణం కల్పించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ యూజర్‌లు అందరికీ దీన్ని వర్తింపచేయాలని సూచించింది. పోర్టింగ్‌ కోసం నిర్దిష్ట కోడ్‌ను (యూపీసీ) పొందడానికి 1900కు ఎస్‌ఎంఎస్‌ పంపే వెసులుబాటు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్లు 1900కు ఎస్‌ఎంఎస్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ఫోన్‌కు వచ్చే కోడ్‌ను కొత్త ఆపరేటరుకు తెలియజేయడం ద్వారా నెట్‌వర్క్‌ మారవచ్చు. అయితే, ప్రస్తుతం కొన్ని టెల్కోలు పలు ప్లాన్లలో ఎస్‌ఎంఎస్‌ ప్యాకేజీలను అందించడం లేదు. దీంతో వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్ల ప్రీపెయిడ్‌ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ ఎస్‌ఎంఎస్‌ ప్యాకేజీ లేదన్న కారణంతో .. 1900 నంబరుకు పోర్టింగ్‌ రిక్వెస్ట్‌ పంపనివ్వకుండా మోకాలడ్డుతున్నాయి. ఎస్‌ఎంఎస్‌లు కావాలంటే మరింత అధిక టారిఫ్‌ ప్లాన్‌నో లేదా ప్రత్యేకంగా ప్యాకేజీనో ఎంచుకోవాల్సి వస్తోంది.

టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్న కొత్త విధానంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విధానంలో ఉన్న వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) కొత్త ప్లాన్లపై రిలయన్స్‌ జియో సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. వీఐఎల్‌ ఇటీవల 18–25% మేర టారిఫ్‌లు పెంచింది. కొత్త టారిఫ్‌ల ప్రకారం 28 రోజుల వేలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ రేటును ఎస్‌ఎంఎస్‌ సర్వీసు లేకుండా రూ. 99కి పెంచేసింది. రూ. 179కి మిం చిన ప్లాన్లలోనే ఎస్‌ఎంఎస్‌ సర్వీసు అందిస్తోంది.

చదవండి: ట్రాయ్‌ నిద్రపోతోందా? హీటెక్కిన బాయ్‌కాట్‌ ట్రెండ్‌ 

మరిన్ని వార్తలు