మొబైల్‌ యూజర్లకు శుభవార్తను అందించిన ట్రాయ్‌..!

7 Apr, 2022 21:57 IST|Sakshi

డిజిటల్‌ చెల్లింపులే లక్ష్యంగా ఫీచర్‌ ఫోన్లలో యూపీఐ లావాదేవీలను ప్రొత్సహించేందుకుగాను ఆర్బీఐ యూపీఐ123పేను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సేవల్లో భాగంగా..మొబైల్‌ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) శుభవార్తను అందించింది.

దేశవ్యాప్తంగా మొబైల్‌ యూజర్లందరికీ అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు గురువారం ట్రాయ్‌ ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవల కోసం వాడే యూఎస్‌ఎస్‌డీ సందేశాలను మొబైల్‌ యూజర్లు పూర్తి ఉచితంగా పొందవచ్చును. కాగా రెండు సంవత్సరాల తరువాత USSD సేవలకు ఛార్జీల విధింపుపై ట్రాయ్‌ సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు USSD సందేశాలపై గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. 

అసలు ఏంటి యూఎస్‌ఎస్‌డీ సందేశాలు..!
USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్‌లను జీఎస్‌ఎమ్‌ సెల్‌ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్‌లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్‌. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్‌ఎస్‌డీ నంబర్స్‌ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. 

చదవండి: వచ్చేసింది..గూగుల్‌ పే, ఫోన్‌ పే యాప్స్‌కు పోటీగా టాటా పే...! 

>
మరిన్ని వార్తలు