ఇక బ్రాడ్ బ్యాండ్ కనీస స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌..!

1 Sep, 2021 21:11 IST|Sakshi

వేగంగా అభివృద్ధి చెందుతున్న మనదేశంలో అంతే వేగంగా ఆన్ లైన్ మార్కెట్‌ పెరుగుతోంది. అలాగే, కరోనా మహమ్మరి వల్ల ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ, మనదేశంలో ఇంకా ఇంటర్నెట్‌ సగటు వేగం 512 కేబీపీఎస్ గానే(కిలో బిట్స్‌ పర్‌ సెకన్‌) ఉంది. ఈ నేపథ్యంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్నెట్‌ వేగాన్ని అందుకోవడానికి చర్యలు తీసుకోవాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కనీస బాడ్ర్‌ బ్యాండ్‌ స్పీడును 2 ఎంబీపీఎస్‌ (మెగాబిట్స్‌ పర్‌ సెకన్‌)కు పెంచాలని పేర్కొంది.(చదవండి: మార్కెట్లోకి సరికొత్త డుగ్‌ డుగ్‌ బండి వచ్చేసింది!)

బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకాలను అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లకు సబ్ స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సహించడానికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(డీబీటీ) పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రాయ్ కేంద్ర ప్రభుత్వానికి పేర్కొంది. టెలికాం రెగ్యులేటర్ పత్రికా ప్రకటన ప్రకారం.. భారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలు బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.

2 ఎంబీపీఎస్ నుంచి 50 ఎంబీపీఎస్ మధ్య వేగం ఉంటే 'బేసిక్' కనెక్షన్ అని, 'ఫాస్ట్' కనెక్షన్ వేగం 50 ఎంబీపీఎస్ నుంచి 300 ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది. అయితే 'సూపర్ ఫాస్ట్' కనెక్షన్ వేగం 300 ఎంబీపీఎస్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కనీస వేగం 2 ఎంబీపీఎస్ అందించడానికి బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లకు ట్రాయ్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇది లైసెన్స్ ఫీజుల నుంచి మినహాయింపు రూపంలో ఉంటుంది. ప్రస్తుతం, బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లు లైసెన్స్ ఫీజు రూపంలో వారి ఆదాయంపై 8% వసూలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు