PM WANI: ‘ఊరూరా పబ్లిక్‌ వైఫై‌.. గేమ్‌ ఛేంజర్‌’

19 Jun, 2021 20:34 IST|Sakshi

ఊరూరా పబ్లిక్‌ వైపై అందించడం కోసం గత సంవత్సరం డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎం వాణి స్కీమ్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. దేశంలో లక్షలాది వైఫై హాట్‌స్పాట్‌లను సృష్టించేందుకు పీఎం వాణి ఎంతగానో ఉపయోగపడనుంది. చౌకగా కోట్లాది మందికి బ్రాడ్‌సేవలు అందుబాటులోకి వస్తుంది. ఈ పథకంతో ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం.

తాజాగా ట్రాయ్‌ చైర్మన్‌ పి.డి. వాఘేలా బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం శుక్రవారం నిర్వహించిన వర్చ్యువల్‌ సమావేశంలో పీఎం వాణీ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎం వాణి స్కీమ్‌తో అందరికి ఇంటర్నెట్‌ రావడమే కాకుండా భారత్‌ వృద్ధిలో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పథకంతో భవిష్యత్తులో గ్రామాల్లో సమూలమార్పులు రానున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ వాడకం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. డిజిటల్‌ ఇండియావైపు పరుగులు తీస్తోన్న మన దేశానికి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు.

ప్రస్తుతం భారత్‌ 750 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌లను కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 500 మిలియన్ల​ వరకు కనెక్షన్‌లు ఉండవచ్చు. ఇంటర్నెట్‌తో సామాజిక ఆర్థిక రంగాల్లో దేశ ముఖచిత్రం మారిపోవడం కాయమని తెలిపారు.

పీఎం వాణీ వేగవంతం సూచనలు చేసిన బీఐఎఫ్‌
బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం ఈ సమావేశంలో రోల్‌ అండ్‌ ఇంపార్టెన్స్‌ ఆఫ్‌ నెక్ట్స్ జనరేషన్‌ వైఫై టెక్నాలజీ పేరుతో ఒక  శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. పీఎం వాణీ పథకం కాస్త వేగంగా ముందడుగు వేయడానికి ప్రస్తుతం ఉన్న అంతరాలను తొలగించాలని ఈ పత్రంలో తెలిపారు. అంతేకాకుండా పథకంపై విసృత స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొంది.  పథకం కోసం చిన్న పారిశ్రామికవేత్తలకు పిడిఓ / పిడిఒఎ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం సులభంగా బ్యాంకు రుణాలు, యుఎస్‌ఓఎఫ్ (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) నుంచి నిధులు సమకూర్చాలని సూచించింది. రోమింగ్‌ను మరింత సులభతరం చేయడం కోసం తగిన మార్పులు చేయాలని పేర్కొంది

చదవండి: Joker Virus: బీ అలర్ట్‌..! ఈ యాప్‌లు డిలీట్‌ చేసి ‘జోకర్‌’ని తరిమేయండి

మరిన్ని వార్తలు