ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!

23 Mar, 2023 10:11 IST|Sakshi

'అనుకుంటే కానిది ఏమున్నది' అన్న మాటలకు రూపం పోస్తే అది 'త్రినా దాస్' (Trina Das). ఈ మాట ఇక్కడ ఊరికే ఉపయోగించలేదు, పిల్లలకు ట్యూషన్ చెప్పే స్థాయి నుంచి ఈ రోజు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ కోట్లకు అధిపతి అయిన త్రినా దాస్ ఎవరు, ఈమె సక్సెస్ సీక్రెట్ ఏమిటనేది ఈ కథనంలో చూసేద్దాం..

పశ్చిమ బెంగాల్‌లో పుట్టిన త్రినా దాస్ మొదటి నుంచే తాను వ్యాపారవేత్త కావాలని, ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి తనవంతు తప్పకుండా కృషి చేయాలని కలలు కనింది. ఈ రోజు ఆ కలలకు నిజం చేసుకుంది.

నిజానికి త్రినా దాస్ కోల్‌కతాలోని బల్లిగంజ్ శిక్షా సదన్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చదివింది. ప్రారంభంలో పాకెట్ మనీ కోసం ఇంటిదగ్గరే పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. ఆ తరువాత తన తండ్రి కోరిక మేరకు 16 మంది 11, 12 తరగతుల పిల్లలకు కేవలం ఒక్కొక్కరికి రూ. 400 ఫీజుతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చెప్పడం ప్రారభించింది.

పదహారు మందితో ప్రారంభమైన ట్యూషన్ సంవత్సరం చివరి నాటికి 1,800కి చేరింది. తరువాత ఆ పిల్లలకు వసతులు కల్పిస్తూ ఆమెకు సహాయంగా మరికొంతమంది ఉపాధ్యాయులను నియమించుకుని సంవత్సరానికి రూ. 8 నుంచి 10 లక్షలు సంపాదించింది. అతి తక్కువ కాలంలోనే ఆమె ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా 86 కోచింగ్ సెంటర్లను ప్రారంభించి 2014-15 నాటికి రూ. 5 కోట్లు ఆర్జించింది.

త్రినా దాస్ 2017లో తన ఇద్దరు స్నేహితులైన నీరజ్ దహియా, అరుణ్ సెహ్రావత్‌తో కలిసి టాలెంట్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రారంభించింది. దీని ద్వారా ఒక సంవత్సరంలో సుమారు రూ. 20 కోట్లు సంపాదించారు. మొదటి లాక్‌డౌన్ సమయంలో వారు బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించి ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుర్గావ్, ఢిల్లీలోని అనేక కంపెనీలకు సెక్యూరిటీ వర్కర్లు, డెలివరీ బాయ్స్, ఆఫీస్ వర్కర్స్ ఉద్యోగాలను అందించడం ప్రారంభించారు. దీని ద్వారా దాదాపు 6,000 మందికి ఉద్యోగాలను కల్పించారు.

(ఇదీ చదవండి: భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..)

ఏప్రిల్ 2022లో ఉద్యోగుల కంటే కంపెనీలకు ఉద్యోగులను అందించడానికి నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఉద్యోగులు మంచి జీతం, హోదా పొందవచ్చని ఆశించింది. దీనికోసం వారు గిగ్‌చెయిన్ ప్రారంభించి వివిధ కంపెనీలకు ఉద్యోగులను అందించింది. ప్రస్తుతం వారి టర్నోవర్ రూ. 102 కోట్లు.

(ఇదీ చదవండి: Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..)

2012 లో బరాక్ ఒబామా ప్రశంసలు అందుకుని  ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందిన త్రినా దాస్ 2021లో తోటి వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. మొత్తానికి త్రినా అనుకున్నది సాధించి విజయానికి చిరునామాగా నిలిచింది.

మరిన్ని వార్తలు