కేంద్రంపై కోర్టుకెక్కిన ట్విట్టర్‌

6 Jul, 2022 13:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నూతన నిబంధనల మేరకు రాజకీయ కంటెంట్‌ను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రభుత్వం బ్లాక్‌ చేయాలని కోరిన కంటెంట్‌కు, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69–ఏకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొంది. రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్‌ చేసిన సమాచారాన్ని నిరోధించడం, పౌర వినియోగదారులకు ఇచ్చిన వాక్‌ స్వాతంత్య్రం హామీకి భంగం కలిగించడమేనంది. 

ప్రభుత్వం చెబుతున్న వివాదాస్పద ఖాతాలపై న్యాయసమీక్ష జరపాలని కోర్టును కోరింది. ఈ పరిణామంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ‘కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాల్సిందే’అని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. జూలై 4వ తేదీలోగా తమ ఉత్తర్వులను అమలు చేయకుంటే చట్టపరమైన రక్షణలు రద్దవుతాయంటూ జూన్‌ 28వ తేదీన ట్విట్టర్‌కు హెచ్చరికలు పంపింది. అంటే, ట్విట్టర్‌ ఉన్నతాధికారులకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీనిపైనా తాజాగా కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్‌ సవాల్‌ చేసింది.  (క్లిక్: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు)

మరిన్ని వార్తలు