దిగొచ్చిన ట్విటర్‌? ఆ ఖాతాలు బ్లాక్‌ ?

12 Feb, 2021 17:05 IST|Sakshi

ట్విటర్‌ వైఖరిపై కేంద్రం అసహనం

ట్విటర్‌కు సుప్రీం నోటీసులు

దిగొచ్చిన ట్విటర్‌

97 శాతం అకౌంట్‌లు బ్లాక్‌

సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ నోటీసులను, ఆదేశాలను పట్టించుకోని ట్విటర్‌ క్రమంగా దిగివస్తోందా? తన నోటీసులను పాటించక పోవడంతో సీరియస్‌ పరిణామాలుంటాయన్న ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ట్విటర్‌ ఖాతాల బ్యాన్‌కు ఉపక్రమించిందన్న అంచనాలు  తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆంక్షలు విధించాలని ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పిన  ట్విటర్‌ ఖాతాల్లో  97 శాతం అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ, ట్విటర్ ప్రతినిధుల సమావేశం తరువాత  ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా.  మొత్తం 1,435  వాటిలో 1,398 ఖాతాలను నిషేధించినట్టు సమాచారం.  అయితే ఈ అంచనాలపై ట్విటర్‌ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. (ట్విట‌ర్‌, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు)

కాగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం, రిపబ్లిక్‌ డే హింస ఘటనల నేపథ్యంలో కేంద్రం ట్విటర్‌పై ఫైర్ అయింది. పాకిస్తాన్,  ఖలిస్తాన్ అనుకూల ట్విటర్‌ ఖాతాలను, అలాగే "రైతుల మారణహోమం" లాంటి  హ్యాష్‌ట్యాగ్‌లను వ్యాప్తి చేస్తున్న 1435 యూజర్ల ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ట్విటర్‌కు నోటిసులిచ్చింది. అయితే భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించ లేమంటూ కొన్ని ఖాతాలను బ్యాన్‌కు నిరాకరించింది. అయితే విద్వేషాన్ని రగిలించే "హానికరమైన కంటెంట్‌ను" ను నిరోధిస్తున్నామని, నిబంధనలను ఉల్లంఘించిన 500 ఖాతాలను శాశ్వతంగా నిలిపివేసిందని పేర్కొంది. దీనిపై ప్ర‌భుత్వం తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేసింది. గురువారం రాజ్యసభలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌, ఫేస్‌బుక్‌, లింక్‌డ్‌ఇన్‌, వాట్సాప్‌సహా ఏ సోషల్ ‌మీడియా సంస్థ అయినా భారత రాజ్యాంగం, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను అగౌరవ పరచడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫేక్‌న్యూస్‌ నిరోధించేందుకు ఒక విధానాన్నిరూపొందించాలంటూ సుప్రీంకోర్టు  ట్విటర్‌, కేంద్రానికి నోటిసులిచ్చిన సంగతి తెలిసిందే. (‘కూ’ యాప్‌ సురక్షితమేనా? సంచలన విషయాలు)

మరిన్ని వార్తలు