ఎలన్ మస్క్‌-ట్విటర్‌ భారీ డీల్‌లో ట్విస్ట్‌.. కోర్టుకెక్కిన వాటాదారు

7 May, 2022 12:12 IST|Sakshi

డెలావేర్‌: ఎలన్ మస్క్ ట్విటర్‌ కొనుగోలు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వాటాదారు అయిన ‘ఫ్లోరిడా పెన్షన్ ఫండ్’..  న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

2025లోపు ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో(యూఎస్‌) పిటిషన్ దాఖలు చేసింది ఎఫ్‌పీఎఫ్‌. అంతేకాదు.. త్వరిత విలీనాన్ని అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరింది. ట్విట్టర్ లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతోపాటు, తనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఇరువురికీ ట్విట్టర్ లో వాటాలుండడం గమనార్హం.  

మోర్గాన్ స్టాన్లేకి 8.8 శాతం వాటా ఉండగా, జాక్ డోర్సేకి 2.4 శాతం వాటా ఉంది. ఎలన్ మస్క్ కు 9.6 శాతం వాటాలు ఉన్నాయి. ఎలన్ మస్క్ కాకుండా, చట్ట ప్రకారం ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు, మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానాన్ని కోరింది. న్యాయపరమైన ఈ చిక్కుల్ని ట్విటర్‌, ఎలన్‌ మస్క్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

చదవండిట్విటర్‌.. టెస్లా ఒక్కటి కాదు - బిల్‌గేట్స్‌

మరిన్ని వార్తలు