ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్ త్వరలో మరో సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. మైక్రో-బ్లాగింగ్ సైట్లో తమ ఆలోచనలను ఒక సుదీర్ఘ కథనం రూపంలో పంచుకోవాలనుకునే వారి అవసరాలను తీర్చడానికి ట్విటర్ ఈ కొత్త ఫీచర్పై పనిచేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా టిప్ స్టార్, రివర్స్ ఇంజనీర్ జేన్ మంచున్ వాంగ్ "ట్విటర్ ఆర్టికల్స్" అనే కొత్త ఫీచర్పై ట్విటర్ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్ సహాయంతో ఎక్కువ పదాలను పోస్ట్ చేయడానికి వీలు ఉంటుందని తెలుస్తుంది.
ట్విటర్ వినియోగదారులు 280 అక్షరాల పరిమితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ట్విటర్లో పూర్తి కథనాలను రాయడానికి అనుమతించనున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ గురుంచి వినియోగదారుడికి తెలిసేలా ట్విటర్ మెనూ బార్లో ప్రత్యేక ట్యాబ్ను తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఫీచర్పై ఒక ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ.. "వ్యక్తుల మధ్య సంభాషణలు, అభిప్రాయాల వెల్లడికి సహాయపడటానికి కంపెనీ ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. త్వరలో మరిన్నింటిని భాగస్వామ్యం చేస్తుంది" అని అన్నారు. దీంతో పాటు ట్విటర్ ఫ్లోక్ అనే మరో కొత్త ఫీచర్ను కూడా పరీక్షిస్తోంది. ఇది ఇన్ స్టాగ్రామ్ లోని క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలాగా పనిచేస్తుంది.
Twitter is working on “Twitter Articles” and the ability to create one within Twitter
Possibility a new longform format on Twitter pic.twitter.com/Srk3E6R5sz
— Jane Manchun Wong (@wongmjane) February 2, 2022
(చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త..!)