ఆధార్ యూజర్లకు షాక్.. 2 సేవలు నిలిపివేత!

7 Jul, 2021 21:17 IST|Sakshi

ఆధార్ యూజర్లకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) చిరునామా ధ్రువీకరణ ప్రక్రియను, డాక్యుమెంట్ల పునఃముద్రణకు సంబంధించిన రెండు సేవలను నిలిపివేసినట్లు తెలిపింది. యుఐడీఏఐ పోస్టల్ చిరునామా ధ్రువీకరణ లేఖ ద్వారా ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని నిలిపివేసింది. యుఐడీఏఐ ఇచ్చిన సమాచారం ప్రకారం తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు అడ్రస్ వాలిడేషన్ లెటర్ సదుపాయాన్ని నిలిపివేసింది. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 

అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం ఇక కష్టం కావొచ్చు. అలాగే, యుఐడీఏఐ పాత కార్డును రి ప్రింట్ చేసే అవకాశాన్ని నిలిపివేసింది. ఇంతకు ముందు కార్డుదారులు అసలు కార్డును కోల్పోతే పాత ఆధార్ కార్డును తిరిగి ముద్రించుకునే అవకాశం ఉంది. లైవ్ హిందుస్థాన్ ప్రకారం ఈ సేవలు ఇప్పుడు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, ట్విట్టర్ లో ఒక వ్యక్తి ఆధార్ కార్డు రీప్రింట్, అడ్రస్ వాలిడేషన్ లెటర్ గురించి ఆధార్ కార్డు హెల్ప్ లైన్ ను అడిగాడు. దీనికి, హెల్ప్ సెంటర్ నుంచి సర్వీస్ అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. ఆధార్ కార్డు రీప్రింట్ స్థానంలో పీవీసీ కార్డును పొందవచ్చు. ఇది ఏటీఎం పరిమాణంలో ఉంటుంది.

మరిన్ని వార్తలు