రికార్డ్‌ లాభాలను సాధించిన ఉజ్జీవన్‌ బ్యాంక్‌

8 Nov, 2022 11:56 IST|Sakshi

క్యూ2లో రూ. 294 కోట్లు 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202223) రెండో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ సంస్థ ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. జులై-సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 294 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది ఒక క్వార్టర్‌కు బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధిక లాభంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 274 కోట్ల నికర నష్టం ప్రకటించింది.

మొత్తం ఆదాయం 63 శాతం జంప్‌చేసి రూ. 1,140 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం సైతం 54 శాతం ఎగసి రూ. 993 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 8.1 శాతం నుంచి 9.8 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 11.8 శాతం నుంచి 5.06 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.29 శాతం నుంచి 0.04 శాతానికి దిగివచ్చాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్‌–సెప్టెంబర్‌)లో క్విప్‌ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 
 

మరిన్ని వార్తలు