డబుల్‌ జీతాలతో అంతా ఖుష్‌.. కానీ, ఆ ఆనందం కొద్దిసేపే!

1 Jan, 2022 12:02 IST|Sakshi

టెక్నికల్‌ తప్పిదాలతో ఒక్కోసారి భారీ నష్టాలు వాటిల్లుతుండడం చూస్తుంటాం. అలాంటి తప్పిదమే ఓ బ్యాంక్‌ నిల్వను ఖాళీ చేసేసింది. పొరపాటున మిలియన్ల డాలర్ల డబ్బు ఖాతాదారుల అకౌంట్‌లో  జమ అయ్యింది. దీంతో డబుల్‌ జీతాలు పడ్డాయని కొందరు ఉద్యోగులు సంతోషపడగా.. ఆ ఆనందం వాళ్లకు ఎంతోసేపు నిలవలేదు.   


క్రిస్మస్‌ పండుగ నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. యూరోపియన్‌ బ్యాంక్‌ శాన్‌టాండర్‌ ఆరోజున లావాదేవీలు నిర్వహించింది. 2 వేలకు పైగా బిజినెస్‌ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కొట్టింది. 75 వేల ట్రాన్‌జాక్షన్స్‌ రూపంలో ఏకంగా 176 మిలియన్‌ డాలర్లు(మన కరెన్సీలో 1,300 కోట్ల రూపాయలు పైనే) జమ అయ్యాయి. అయితే కాసేపటికే చాలామంది ఉద్యోగులకు డబుల్‌ జీతాలు పడ్డట్లు సందేశాలు వచ్చాయి. మరోవైపు సప్లయర్స్‌కు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ఎమౌంట్‌ అకౌంట్‌లలో పడింది. దీంతో అంతా డబుల్‌ బొనాంజా అనుకుని సంతోషపడ్డారు.అయితే..

బ్యాంకు నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో బ్యాంక్‌ అప్రమత్తం అయ్యింది. ‘షెడ్యూలింగ్‌ ఇష్యూ’ వల్ల డూప్లికేట్‌ పేమెంట్స్‌ జరిగిందని గుర్తించింది. పొరపాటును సరిదిద్దుకునేందుకు రంగంలోకి దిగింది. చాలావరకు అకౌంట్ల నుంచి మనీని వెనక్కి తీసేసుకుంది. అయితే కొన్ని అకౌంట్లు మాత్రం ప్రత్యర్థి బ్యాంకులు నిర్వహించే బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లడం కొసమెరుపు.

టెక్నికల్‌ ఇష్యూ వల్ల తప్పిదం జరిగిందని, రికవరీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని శాన్‌టాండర్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూకే బ్యాంకింగ్‌ వ్యవస్థలోని ‘బ్యాంక్‌ ఎర్రర్‌ రికవరీ ప్రాసెస్‌’ ప్రకారం.. జత అయిన డబ్బులను వెనక్కి రప్పించుకునే వీలుంది. అంతేకాదు ఈ పద్ధతిలో అవతలి బ్యాంకులు సైతం యాక్సిడెంటల్‌గా జమ అయిన చెల్లింపులను ఖాతాదారుల అకౌంట్‌ నుంచి వెనక్కి తీసుకుని.. నష్టపోయిన బ్యాంకుకు అందజేయాల్సి ఉంటుంది.

చదవండి: ఒక్క ఏడాది.. పది మంది.. ఎంతో సంపాదించారో తెలిస్తే షాకే!

మరిన్ని వార్తలు