డిజిటల్‌గా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల జారీ

22 Sep, 2022 06:19 IST|Sakshi

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫెడరల్‌ బ్యాంక్‌ పైలట్‌ ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల (కేసీసీ) జారీని సులభతరం చేసే ప్రక్రియకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫెడరల్‌ బ్యాంక్‌ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి పైలట్‌ ప్రాజెక్టులను ప్రారంభించాయి. కేసీసీ తీసుకునేందుకు పేపర్‌ రూపంలో స్థల రికార్డుల పత్రాలను దాఖలు చేయడం, భౌతికంగా బ్యాంకు శాఖను సందర్శించడం వంటి బాదరబందీ లేకుండా డిజిటల్‌గానే ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపాయి.

ఇందుకోసం రెండు బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌)తో జట్టు కట్టాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో, ఫెడరల్‌ బ్యాంక్‌.. చెన్నైలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించాయి. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌లోనే పొలం వెరిఫికేషన్‌ కూడా జరుగుతుందని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎడీ ఎ మణిమేఖలై తెలిపారు.

మరిన్ని వార్తలు