పాన్‌కార్డుపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!

24 Dec, 2022 14:21 IST|Sakshi

పాన్‌ కార్డ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రజలు జరుపుతున్న కొన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరాన్ని పక్కన పెట్టనుంది. ఈ అంశమై రాబోయే బడ్జెట్ 2023 లో కొన్ని మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, పాన్ కార్డ్ వివరాలు అందించని ఆర్థిక లావాదేవీలకు 20% టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. 

అన్నింటికి పాన్‌ అక్కర్లేదు.. త్వరలో నిర్ణయం!
ప్రస్తుతం దాదాపు బ్యాంకు అకౌంట్లన్నీ ఆధార్‌తో లింక్ అయినవేనని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఈ నేపథ్యంలో పాన్‌ వివరాలు తప్పనిసరి అవసరం లేదని బ్యాంకులు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి సమాచారం అందిందని, వాటిని పరిశీలిస్తున్నామని, బడ్జెట్ సందర్భంగా ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.  బ్యాంకుల నుంచి రుణాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నందున, ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని కొందరు రుణదాతలు సూచించినట్లు అధికారి తెలిపారు.

అయితే రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధార్ మద్దతుతో ఆర్థిక లావాదేవీలకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపితే కొన్ని లావాదేవీలకు పాన్ నెంబర్ అవసరం ఉండకపోవచ్చు. దీంతో పాన్ కార్డ్ లేనివారికి, కాస్త ఊరట లభించనుంది. అయితే దీనిపై పూర్తి సమాచారం, నియమ నిబంధనలు వంటివి వచ్చే బడ్జెట్‌లో తెలిసే అవకాశం ఉంది.

చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌!

మరిన్ని వార్తలు