ద్విచక్ర వాహన అమ్మకాలు అదుర్స్‌ 

3 Oct, 2020 08:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఒక్క టీవీఎస్‌ మోటార్‌ విక్రయాలు మాత్రం స్వల్పంగా క్షీణతను చవిచూశాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ 5.0 ప్రారంభం కావడం, కోవిడ్‌ వ్యాప్తి భయాలతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం తదితర కారణాలు అమ్మకాలను పుంజుకునేలా చేశాయి. ఈ సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్, టీవీఎస్‌ మోటార్, బజాజ్‌ ఆటో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీల మొత్తం విక్రయాలు 17,33,777 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 15,43, 353 యూనిట్లతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. ఇదే ఏడాది ఆగస్ట్‌ నెల విక్రయాల(14,41041)తో పోలిస్తే 20 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి.  

అవుట్‌లుక్‌: కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ కొంత స్తబ్ధుగా ఉంది. పండుగ సీజన్‌ సందర్భంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంతంలోని విక్రయాల లోటును భర్తీ చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు