పండుగల సీజన్‌లో ఎస్‌యూవీల సందడే సందడి!

25 Jun, 2022 17:42 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్‌ బహుళ ప్రయోజాలతో కూడిన స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీలు) పెద్ద ఎత్తున ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలవనుంది. సుమారు డజను ఎస్‌యూవీ మోడళ్లను కంపెనీలు విడుదల చేయనున్నాయి.

వీటి ధరలు రూ.5.5 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉండనున్నాయి. మిగతా సంవత్సరాలకు ఈ ఏడాది భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే కంపెనీలు సాధారణంగా ఏడాదిలో వివిధ సందర్భాల్లో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తుంటాయి. కానీ, ఈ విడత రానున్న పండుగల సీజన్‌ను ఆవిష్కరణలకు లక్ష్యంగా పెట్టుకోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

2020–21లో ఎనిమిది కొత్త కార్లు విడుదల కాగా.. వీటి ఆవిష్కరణలు ఏడాది వ్యాప్తంగా కొనసాగాయి. 2021–22లో ఏడు కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లోనూ కొత్త కార్ల ఆవిష్కరణలు ఐదు లేదా ఆరు స్థాయిలో ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మాత్రం పదికి పైగా కొత్త ఎస్‌యూవీలు వినియోగదారులను పలకరించనున్నాయి. దేవీ నవరాత్రులతో పండుగల సందడి తారా స్థాయికి చేరి, దీపావళితో ముగుస్తుంటుంది. ఆటో కంపెనీలకు ఈ పీరియడ్‌ చాలా కీలకమైనది. ఏడాదిలో నమోదయ్యే విక్రయాల్లో 20% ఈ 3 నెలల కాలంలోనే నమోదవుతుంటాయి. కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడం అసాధారమేమీ కాదు. కానీ, ఈ ఏడాది పండుగల సీజన్‌ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ఎస్‌యూవీలు (ఒకే తరహా బాడీతో కూడినవి) ఆవిష్కరణ చేస్తుండడమే ప్రత్యేకం.   

ముందుగా మారుతీ.. 
మొదటిగా మారుతీ సుజుకీ నుంచి కొత్త జెనరేషన్‌ బ్రెజ్జా ఆవిష్కరణ ఉండనుంది.గత సోమవారం మారుతి సుజుకీ ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడంతోపాటు, బుకింగ్‌లు తీసుకోవడాన్ని ప్రారంభించింది. జూన్‌ 30న  విడుదల కానుంది. మిడ్‌సైజు ఎస్‌యూవీ అయిన టయోటా హైరైడర్‌ జూలై 1న మార్కెట్లోకి రానుంది. ఇది హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌కు పోటీనివ్వనుంది. టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ (బ్రెజాకు రీబ్రాండింగ్‌)ను కూడా ఆవిష్కరించనుంది.

మరిన్ని వార్తలు