ఇది ఆన్‌లైన్‌ పేమెంట్‌ రికార్డ్, రూ.12.11 లక్షల కోట్లు.. తెగ వాడుతున్నారుగా!

2 Nov, 2022 12:39 IST|Sakshi

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్పులు చోటు చేసుకోవడం సహజం. గతంలో చెల్లింపులు నగదు లేదా చెక్‌ రూపంలో చేస్తున్న ప్రజలు, ఇటీవల డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రావడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కరోనా నుంచి ఈ డిజిటిల్‌ చెల్లింపులు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. తాజాగా  యూపీఐ లావాదేవీల సంఖ్య అక్టోబర్‌లో 7.7 శాతం పెరిగి 730 కోట్లు నమోదయ్యాయి.

వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లు రికార్డ్‌ స్థాయిలో జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. సెప్టెంబర్‌లో 678 కోట్ల లావాదేవీలకుగాను విలువ రూ.11.16 లక్షల కోట్లుగా ఉంది. ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌) లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు కాగా, వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఎన్‌ఈటీసీ ఫాస్టాగ్‌ లావాదేవీల విలువ రూ.4,452 కోట్లకు చేరుకుంది. 

సురక్షితమైన, వేగంతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఆధార్ కార్డ్‌ని ఏఈపీఎస్‌తో అనుసంధానించగా.. గత నెలలో 10.27 కోట్లు ఉండగా అక్టోబర్‌లో ఇవి 11.77 కోట్లకు చేరుకుంది. ఏఈపీఎస్ లావాదేవీల విలువ రూ.26,665.58 కోట్ల నుంచి రూ.31,112.63 కోట్లకు పెరిగింది.

చదవండి: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌: అందరికీ ఒకటే ఐటీఆర్‌ ఫామ్‌!

>
మరిన్ని వార్తలు