షేర్ల బైబ్యాక్‌కు యూపీఎల్‌ సై

3 Mar, 2022 03:59 IST|Sakshi

షేరుకి రూ. 875 గరిష్ట ధర

న్యూఢిల్లీ: అగ్రోకెమికల్స్‌ దిగ్గజం యూపీఎల్‌ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రమోటర్లు మినహా వాటాదారుల నుంచి షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరుకి రూ. 875 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో సుమారు 1.65 శాతం వాటాను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి గరిష్ట ధర ప్రకారం సుమారు 1,25,71,428 షేర్లను కొనుగోలు చేసే వీలుంది. ఇందుకు రూ. 1,100 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రతిపాదిత బైబ్యాక్‌కు నియంత్రిత సంస్థలు తదితరాల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 28.24 శాతం వాటా ఉంది. ప్రస్తుత డిసెంబర్‌ క్వార్టర్‌లో కంపెనీ రూ. 1,179 కోట్ల నికర లాభం ఆర్జించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు