‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్‌!

27 Oct, 2022 17:59 IST|Sakshi

వ్యాపారస్తులు ఉన్నత శిఖరాలకు చేరి బిలియనీర్లుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇక్కడి వరకు వారి పయనం ధనార్జన, పేరు ప్రఖ్యాతలంటూ ఒకేలా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర సంపాదన మాత్రమే జీవితం కాదని కొందరు తెలుసుకుంటున్నారు. అందుకే చాలా మంది ధనవంతులు ఛారిటీలకు, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు వారి సంపదను ఖర్చు పెడుతుంటారు.

ఇంకొందరు మరో అడుగు ముందేసి తమ ఆస్తిలో సగం భాగం లేదా మొత్తం కూడా ఇచ్చేస్తుంటారు. తాజాగా ఒక సంపన్నుడు తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! యూఎస్ లోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చైన్ హాబీ లాబీ (Hobby Lobby) వ్యవస్థాపకుడు డేవిడ్ గ్రీన్ తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపదను శాపంగా పేర్కొన్నారు. అందుకే తన కంపెనీని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేశారు. 

తన కంపెనీని విడిచి పెట్టడంపై స్పందిస్తూ తాను కేవలం నిర్వాహకుడినేనని.. తన వ్యాపారానికి దేవుడే నిజమైన యజమానని నిజం తెలుసుకున్నాని, దాని ఫలితమే ఈ నిర్ణయమని చెప్పారు. తన విజయానికి తన విశ్వాసమే "నిజమైన మూలం" అని వివరించాడు. యజమానిగా, కంపెనీని విక్రయించే హక్కుతో సహా కొన్ని హక్కులు, బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. అయితే తన కంపెనీ విస్తరించే కొద్దీ, ఆ ఆలోచన తనని మరింత బాధపెట్టడం ప్రారంభించిందని తెలిపాడు.

ఇంకా చెప్పాలంటే సంపద ఓ రకంగా శాపంలాంటిదని  అభిప్రాయపడ్డాడు. అయితే గ్రీన్ తన కంపెనీని ఎలా వదులుకుంటున్నాడు అనే వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అయితే గత వారం ఫాక్స్ & ఫ్రెండ్స్ వీకెండ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీ ఓటింగ్ స్టాక్‌లో 100% ట్రస్ట్‌కు తరలించబడిందని ఆయన చెప్పారు.

చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్‌ లెటర్స్‌ లేవు.. అన్నింటికీ అదే కారణమా

మరిన్ని వార్తలు