ఎలన్‌ మస్క్‌ కంపెనీకి యూఎస్‌ గట్టి హెచ్చరిక...!

19 Jul, 2021 17:55 IST|Sakshi

వాషింగ్టన్‌:  ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ అంగారక గ్రహం, చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో తహతహలాడుతున్నాడు. అందుకోసం ఇప్పటికే మానవులను ఇతరగ్రహలపైకి రవాణాచేసే అంతరిక్షనౌక స్టార్‌షిప్‌ ప్రయోగాలను స్పేస్‌ఎక్స్‌ కంపెనీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనేక పరాజయాల తరువాత అంతరిక్షనౌక స్టార్‌షిప్‌.. నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసి గాల్లో చక్కర్లు కొడుతూ హై ఆల్టిట్యూడ్‌ టెస్ట్‌ను విజయవంతంగా స్పేస్‌ఎక్స్‌ సంస్థ పరీక్షించింది.

తాజాగా స్టార్‌షిప్‌ను తొలిసారిగా భూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలని స్పేస్‌ ఎక్స్‌ ప్రణాళిక చేస్తోంది. కాగా  ప్రస్తుతం ఈ ప్రయోగానికి ఫెడరల్‌ ఏవియేషన్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) నుంచి ఆమోదం రాలేదు. ఎఫ్‌ఏఏ నుంచి ఆమోదం రాకపోయినా స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌షిప్‌ భూ నిర్ణీత కక్ష్యలోకి పంపే ప్రయోగాన్ని కొనసాగిస్తుంది.  టెక్సాస్‌లోని బోకా చికా ప్రయోగ స్థలంలో  పర్యావరణ సమీక్ష అసంపూర్తిగా ఉందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) స్పేస్‌ఎక్స్‌ సంస్థను హెచ్చరించింది.

ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ ప్రతిపాదిత రాకెట్ అసెంబ్లీ  "ఇంటిగ్రేషన్ టవర్" పై ఏజెన్సీ పర్యావరణ సమీక్ష చేస్తోందని ఎఫ్‌ఎఎ ప్రతినిధి బుధవారం పేర్కొన్నారు. కాగా కంపెనీ రిస్క్‌ తీసుకొని టవర్‌ నిర్మాణం చేపడుతుందనీ ఎఫ్‌ఏఏ ప్రతినిధి ఆరోపించారు.ఒకవేళ పర్యావరణ సమీక్షలో స్పేస్‌ఎక్స్‌ ఫెయిల్‌ ఐతే స్టార్‌షిప్‌ రాకెట్‌ అసెంబ్లీ లాంఛింగ్‌ టవర్‌ను కూల్చివేయడానికి ఎఫ్‌ఏఏ ఆదేశాలను ఇవ్వొచ్చును. అంతేకాకుండా ప్రయోగ సమయంలో పర్యారణానికి హాని చేకూరితే కఠిన చర్యలను తీసుకోవడానికి ఎఫ్‌ఏఏ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మే ఆరో తేదీనా ఎఫ్‌ఏఏ ప్రతినిధులు చేస్తోన్న పర్యావరణ సమీక్ష స్టార్‌షిప్‌ ప్రయోగ ప్రక్రియను క్లిష్టతరం చేస్తాయని స్పేస్‌ఎక్స్‌  తన లేఖలో పేర్కొంది. కాగా ఈ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్‌ఎక్స్‌ సంస్థ అధ్యక్షురాలు గ్విన్నే షాట్‌వెల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్‌షిప్‌ ప్రయోగం విజయవంతమైతే ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు