వేదాంతా చేతికి ఎథేనా చత్తీస్‌గఢ్‌

9 Jul, 2022 06:28 IST|Sakshi

డీల్‌ విలువ రూ. 565 కోట్లు

న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఎథేనా చత్తీస్‌గఢ్‌ పవర్‌ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 565 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. నగదు రూపేణా చేపట్టనున్న ఈ డీల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో పూర్తయ్యే వీలున్నట్లు వేదాంతా తెలియజేసింది. ఎథేనా చత్తీస్‌గఢ్‌ పవర్‌ లిక్విడేషన్‌ ప్రక్రియ గతేడాది మార్చిలో ప్రారంభమైంది. కంపెనీలో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. ఈ కొనుగోలుతో అల్యూమినియం బిజినెస్‌ విద్యుత్‌ అవసరాలు తీరనున్నట్లు తెలియజేసింది.

ఏథేనా పవర్‌.. చత్తీస్‌గఢ్‌లోని ఝాంజ్‌గిర్‌ చంపా జిల్లాలో 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంటును కలిగి ఉంది. 2019 మే 15న కంపెనీపై కార్పొరేట్‌ దివాలా రుణపరిష్కార ప్రాసెస్‌ ప్రారంభమైంది. గతేడాది మే 13న ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ లిక్విడేషన్‌ ప్రాసెస్‌కు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి గల రెండు యూనిట్లలలో 80 శాతం, 30 శాతం చొప్పున పనులు పూర్తయ్యాయి. దీంతో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించలేదు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లకు విద్యుత్‌ ప్లాంటు అనుసంధానమై ఉండటం గమనార్హం!

మరిన్ని వార్తలు