వేదాంతా లాభం అప్‌

29 Jul, 2022 02:47 IST|Sakshi

క్యూ1లో రూ. 4,421 కోట్లు

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 4,421 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,224 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 29,151 కోట్ల నుంచి రూ. 39,355 కోట్లకు జంప్‌చేసింది.

అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 32,095 కోట్లకు ఎగశాయి.  ఫైనాన్స్‌ వ్యయాలు స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 1,206 కోట్లకు చేరగా.. రూ. 8,031 కోట్లమేర స్థూల రుణాలు జత కలిశాయి. దీంతో మొత్తం రుణ భారం రూ. 61,140 కోట్లను తాకింది. కాగా, భాగస్వామ్య నియంత్రణా సంస్థలను కూడా కలుపుకుంటే ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం నికర లాభం 6 శాతం మెరుగుపడి రూ. 5,592 కోట్లుగా నమోదైంది.

స్టెరిలైట్‌ యూనిట్‌కు బిడ్స్‌
తమిళనాడులోని తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కాపర్‌ యూనిట్‌ కొనుగోలుకి పలు సంస్థల నుంచి బిడ్స్‌ దాఖలైనట్లు వేదాంతా రీసోర్సెస్‌ తాజాగా వెల్లడించింది. తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో 2018 నుంచి మూతపడిన స్టెరిలైట్‌ కాపర్‌ స్మెల్టింగ్‌ ప్లాంటును వేదాంతా అమ్మకానికి పెట్టింది.

ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 245 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు