అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ

26 Feb, 2021 09:13 IST|Sakshi

ఒకటి  కాదు  రెండు వాహనాలు, స్కార్పియో, ఇన్నోవా

అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు, భారీ భద్రత 

సంచలనం రేపిన స్కార్పియోలో జిలెటిన్‌ స్టిక్స్‌ 

సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ  నివాసం 'ఆంటిలియా'దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్‌ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్‌ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వాహనం లోపల ఒక బ్యాగును, ఒక లేఖను కనుగొ‍న్నారు. కానీ దానిలోని విషయాలను ఇంకా అధి​కారికంగా వెల్లడించలేదు. ‘ముఖేశ్‌ భయ్యా, నీతా భాబీ ఇదొక ట్రైలర్‌ మాత్రమే’’ అని లేఖలో  రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్‌  పరిశీలన తరువాత గురువారం రాత్రి 1 గంటకు ఆంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.  ఆగంతకులు స్కార్పియో, ఇన్నోవా రెండు వాహనాల్లో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. స్కార్పియో డ్రైవర్‌ అంబానీ ఇంటి సమీపంలో వాహనాన్ని ఆపి, మరో కారులో అక్కడినుంచి ఉడాయించాడు. 

ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఈ వాహనంలో జిలెటిన్‌ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంబానీ ఇంటి వెలుపల భద్రత  కట్టుదిట్టం చేశారు. సీసీటీవీఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు