Vodafone Idea 5G: వోడాఫోన్ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!

14 Apr, 2023 18:46 IST|Sakshi

వోడాఫోన్ కస్టమర్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారతదేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వోడాఫోన్‌ సిద్ధమవుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్‌పర్సన్ కుమార్ మంగళం బిర్లా ఓ వార్తాచానెల్‌రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వొడాఫోన్ ఐడియా  5జీ సేవలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ధ్రువీకరించారు.

(Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) 

వోడాఫోన్ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను వేగంగా కోల్పోతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. రాబోయే 5జీ సేవల కోసం వోడాఫోన్‌ మోటరోలా, షావోమీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం వోడాఫోన్ భారతదేశంలో 4జీ సేవలను మాత్రమే అందిస్తోంది. దేశంలో 5జీ సేవలను ఇప్పటివరకూ ప్రారంభించని ఏకైక టెలికాం కంపెనీ ఇదే. జియో, ఎయిర్‌టెల్‌ రెండూ ఇప్పటికే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

భారత్‌లో వోడాఫోన్ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ అది ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేది స్పష్టం చేయలేదు. దేశంలో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలకు వొడాఫోన్ ఐడియా క్రమంగా కస్టమర్లను కోల్పోతున్న క్రమంలో ఈ ప్రకటన వచ్చింది. 2021 ఏప్రిల్  నుంచి వోడాఫోన్‌ 42.4 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. 2022 డిసెంబర్ నాటికి 12 నెలల వ్యవధిలో 24.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్-బేస్ కోతను చవి చూసింది.

(tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..)

2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా రూ. 7,990 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 7,595.5 కోట్లు. అయితే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.10,620.6 కోట్లు కాగా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.10,614.6 కోట్లు. ఎయిర్‌టెల్‌, జియో 5జీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దూసుకెళ్తుంటే వోడాఫోన్ ఐడియా వెనుకబడి ఉంది. ఏది ఏమైనప్పటికీ త్వరలో 5జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు వోడాఫోన్‌ ఐడియా ప్రకటించడం వల్ల కోల్పోయిన కస్టమర్లను తిరిగి పొందడంలో కొంతైనా సహాయపడవచ్చు.

(Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...)

మరిన్ని వార్తలు