వొడాఫోన్‌ ఐడియా- క్రెడిట్‌యాక్సెస్‌ జోరు

4 Sep, 2020 11:41 IST|Sakshi

నిధుల సమీకరణ ప్రతిపాదనపై బోర్డు మీటింగ్‌

15 నెలల గరిష్టానికి వొడాఫోన్‌ ఐడియా షేరు

3 రోజుల్లోనే 75 శాతం ర్యాలీ చేసిన వొడాఫోన్‌

నిధుల సమీకరణ  ప్రతిపాదనలకు బోర్డు ఓకే 

క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్ షేరు 9 శాతం హైజంప్

టెక్‌ దిగ్గజాలలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు పతనంకాగా.. దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. ప్రధాన రంగాలన్నిటా అమ్మకాలు తలెత్తడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 450 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు చొప్పున జారాయి. ఈ నేపథ్యంలోనూ నిధుల సమీకరణ ప్రతిపాదనల కారణంగా మొబైల్‌ సేవల కంపెనీ వొడాఫోన్‌ ఐడియా, మైక్రోఫైనాన్స్‌ కంపెనీ క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

వొడాఫోన్‌ ఐడియా
సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్‌ బకాయిలను చెల్లించవలసి ఉన్న మొబైల్‌ సేవల దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా నిధుల సమీకరణ ప్రణాళికలను ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు బోర్డు నేడు(4న) సమావేశంకానున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. మరోపక్క కంపెనీలో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, యూఎస్‌ వైర్‌లెస్‌ దిగ్గజం వెరిజాన్‌ కమ్యూనికేషన్స్‌ 400 కోట్ల డాలర్లు(రూ.29,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసింది. రూ. 13.5ను తాకింది. ఇది 15 నెలల గరిష్టంకాగా.. ప్రస్తుతం 1.2 శాతం లాభంతో రూ, 12.70 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్‌ 1న నమోదైన ఇంట్రాడే కనిష్టం రూ. 7.69 నుంచి చూస్తే.. మూడు రోజుల్లోనే ఈ షేరు 75 శాతం ర్యాలీ చేయడం విశేషం!

క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్
ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ లేదా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ తదితర మార్గాలలో రూ. 1,000 కోట్లవరకూ సమీకరించేందుకు గురువారం సమావేశమైన బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 749ను తాకింది.  ప్రస్తుతం కాస్త మందగించి 6 శాతం లాభంతో రూ. 727 వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు