వోడాఫోన్ ఐడియా: ఉద్యోగులపై వేటు

4 Aug, 2020 11:33 IST|Sakshi

1500 మందికి ఉద్వాసన

సాక్షి, ముంబై : ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల భారానికి తోడు నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం తదితర కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 

ఖర్చులను తగ్గించుకునే క్రమంలో దేశవ్యాప్తంగా  దాదాపు 1500 మంది  ఉద్యోగులను  తొలగించింది. ముఖ్యంగా వోడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే,  జెడ్‌టిఇ 4జీ పరికరాల కొత్త ఆర్డర్లు ఆలస్యం కావడంతో  సంస్థ సంక్షోభంలో చిక్కుకుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే చైనా నుంచి కొత్త ఆర్డర్‌లను తీసుకోవడం కూడా ఆగిపోయి ఉండవచ్చని అంచనా. దీనికితోడు మే నెలలో  22 టెలికాం సర్కిల్స్ ను 10కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. అటు తాజా త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్య భారీగా పడిపోయింది. ఏజీఆర్ మొత్తం బకాయిలు చెల్లిస్తే..తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనీ, ఈ క్రమంలో ఈ చెల్లింపులకు ఇరవై ఏళ్లు సమయం కావాలని  సంస్థ ఇటీవల సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే 
 

>
మరిన్ని వార్తలు