జియో, ఎయిర్‌టెల్ దెబ్బకు లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా

23 May, 2023 11:13 IST|Sakshi

భారతదేశంలో అతి పెద్ద టెలికం సంస్థలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్‍(Airtel) గత మార్చి నెలలో భారీ సంఖ్యలో కొత్త సబ్‍స్క్రైబర్లను పొందింది. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రమే రోజు రోజుకి తన యూజర్లను కోల్పోతూనే ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 మార్చి నెలలో రిలయన్స్ జియోకు 30.5లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు యాడ్ అయ్యారు. దీంతో జియో యూజర్ల సంఖ్య ఏకంగా 43 కోట్లు దాటింది. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 42.71 లక్షలుగా నమోదైంది. ఎయిర్‌టెల్ కూడా మార్చి నెలలో 10.37లక్షల కొత్త సబ్‍స్క్రైబర్లను పొందింది. ఈ కొత్త సబ్‍స్క్రైబర్ల సంఖ్యతో మొత్తం యూజర్ల సంఖ్య 37.09 కోట్లకు చేరింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఎయిర్‌టెల్ సబ్‍స్క్రైబర్ల సంఖ్య 36.98 కోట్లుగా ఉండేది. ఈ రెండు సంస్థలు మార్చిలో మంచి వృద్ధిని నమోదు చేసుకోగలిగాయి.

ఇక వొడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ యూజర్లు క్రమంగా తగ్గుతున్నారు. ఈ ఏడాది మార్చిలో 12.12 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియా సబ్‍స్కైబర్ల సంఖ్య 23.67 కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 23.79 కోట్లుగా ఉండేది.

(ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్‌జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!)

మరింత మంచి వృద్ధిని పెంచుకోవడానికి, ఎక్కువ మంది సబ్‍స్క్రైబర్లను ఆకర్షించడానికి జియో, ఎయిర్‌టెల్ రెండూ 5జీ నెట్‍వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. అంతే కాకుండా రూ.239 అంతకన్నా ఎక్కువ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 5జీ ఉన్న ప్రాంతాల్లో 5జీ నెట్‍వర్క్‌పై ఉచితంగా అన్‍లిమిడెట్ డేటా అందిస్తున్నాయి.

(ఇదీ చదవండి: మళ్ళీ ఇండియాకు రానున్న చైనా బ్రాండ్ ఇదే - ఇషా అంబానీ అంటే మినిమమ్ ఉంటది!)

జియో, ఎయిర్‌టెల్ నెట్‍వర్క్‌ను విస్తరించడంతో పరుగులు పెడుతుంటే వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా 5జీ నెట్‍వర్క్ లాంచ్ చేయనేలేదు. 5జీ నెట్‍వర్క్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పైగా ఉన్న యూజర్లను కూడా కంపెనీ కోల్పోతోంది. ఇవన్నీ రానున్న రోజుల్లో వొడాఫోన్ ఐడియాకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు