ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు ఊరట: వాయిస్‍తో యూపీఐ చెల్లింపులు

10 Sep, 2022 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)  పేమెంట్‌ సేవల్లో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది.  ఇప్పుడు బహుళ భాషల్లో వాయిస్ ద్వారా  డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. వీటిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ , బెంగాలీ భాషల్లోఇది అందుబాటులోఉంది.  ఈ సేవ త్వరలో గుజరాతీ, మరాఠీ,పంజాబీ వంటి ఇతర భాషలలో అందుబాటులోకి రానుంది.  ఎన్‌ఎస్‌డీఎల్‌పేమెంట్స్ బ్యాంక్ ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో టోన్‌ట్యాగ్ ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్‌  దేశంలోని 400 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులను వాయిస్ ద్వారా చెల్లింపు సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతినిస్తుంది

యూపీఐ పేమెంట్స్‌ స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే పరిమితం  కాకుండా ఏడాది మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో ఫీచర్ ఫోన్‌వినియోగ‌దారుల‌కు 'యూపీఐ 123పే' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా చెల్లింపులు చేసుకునే సౌలభ్యం వారికి లభించింది. ఇప్పుడు, VoiceSe అనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన భాష‌లో మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 

ఈ చెల్లింపుల కోసం వినియోగదారులు 6366 200 200 ఐవీఆర్ నంబ‌ర్‌కు కాల్ చేసి, తమ ప్రాంతీయ భాష‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి చేసుకోవచ్చు, నిధుల‌ను బ‌దిలీ చేయ‌లేరు. టోన్‌ట్యాగ్ సహ వ్యవస్థాపకుడు, ల్యాబ్స్ డైరెక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 100 శాతం డిజిటల్ అక్షరాస్యత లేదా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడని డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను అందించేందుకు, సిరి , అలెక్సాలకు మించిన వాయిస్ టెక్నాలజీని పరిశీలిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు