క్రాష్‌ టెస్ట్‌: వోల్వో సంచలన నిర‍్ణయం

16 Nov, 2020 20:59 IST|Sakshi

 కొత్త కార్లతో  క్రాష్‌ టెస్ట్‌10 కార్లను 30 మీటర్ల ఎత్తునుంచి  పడవేసి మరీ పరీక్షలు

సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10 కార్లను 30 మీటర్ల ఎత్తునుంచి పడవేసి మరీ క్రాష్‌ టెస్ట్ నిర్వహించింది. అత్యున్నత ప్రమాణాలను సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా తొలిసారి పలు మోడళ్ల  కొత్త కార్లను క్రేన్ల సాయంతో 30 మీటర్ల ఎత్తునుంచి కిందికి తోసివేసింది. తద్వారా ప్రమాదాల్లో కారులోపల ఉన్నవారి పరిస్థితిని అంచనా వేయడం, రక్షణ చర్యల్లో రెస్క్యూ సిబ్బందికి  సూచనలు సలహాలు ఇవ్వనుంది.

సాధారణంగా 20ఏళ్ల నాటి కార్లపై చేసే ప్రయోగాలను కొత్త కార్లతో చేయడం విశేషం. ఘోర ప్రమాదాల్లో లోపల ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ ఉపయోగించి వారిని వెలికి తీసి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడంలాంటి అంశాలను పరిశీలించింది.  తద్వారా వారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ భావిస్తోంది. రక్షణ సిబ్బంది నిరంతరం అప్‌డేట్ కావడం, కొత్త ఎక్స్‌ట్రికేషన్ టెక్నిక్‌లను అభివృద్ధి, సమీక్ష కీలకమని సంస్థ భావిస్తోంది. 

తీవ్రమైన ప్రమాదాల తర్వాత ప్రజలను వెలికితీసే కొత్త పద్ధతులను  అవలంబించేలా  అత్యవసర రక్షణ సిబ్బంది సహాయం చేయాలనుకుంటున్నాం. ఇందుకు సాధారణ క్రాష్ పరీక్షలు సరిపోవు. అందుకే కొంచెం విపరీతంగా ఆలోచించాల్సి వచ్చిందని వోల్వో తెలిపింది. అతివేగంతో కార్లు ప్రమాదానికి గురి కావడం, ఈ ఘోర ప్రమాదాల్లో కార్లు దెబ్బతినడం, కార్లలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం తదితర కీలక​ అంశాలపై నివేదికను రూపొందించడంతో పాటు, ఈ ఇంటెన్సివ్ అనాలిసిస్ రిపోర్టును సహాయక బృందాలకు ఉచితంగా అందిస్తుంది.  రెస్క్యూ ప్రొవైడర్ల అభ్యర్థన మేరకు ఈ క్రాష్‌ టెస్ట్‌ చేసినట్టు వోల్వో వెల్లడించింది. ఫలితాల నుండి నేర్చుకోవడానికి, ప్రయాణీకుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను అదనంగా అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు