2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్‌, సూపర్‌ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!

26 Jul, 2022 14:07 IST|Sakshi

సాక్షి,ముంబై: వోల్వో ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ కారును  లాంచ్‌ చేసింది. XC40 రీఛార్జ్‌ ఎస్‌యూవీని మంగళవారం  భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధరను రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంచింది. పెట్రోల్‌వెహికల్‌ ఎక్స్‌సి 40తో పోలిస్తే రూ 1.40 లక్షలు ఎక్కువ.

బెంగళూరు సమీపంలోని హోస్కోట్‌లోని వోల్వో యూనిట్‌లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది.  ఇది  వోల్వో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి గలకొనుగోలుదారులు రూ. 50వేలు చెల్లించి రేపటి(జూలై27)నుంచి బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఎక్స్‌సీ40 రీఛార్జ్  11kW వాల్-బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది.కారుపై మూడేళ్ల వారంటీతోపాటు,  బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది.  వోల్వో XC40 రీఛార్జ్ 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78kWh బ్యాటరీని ఈ కారులో అందించింది.  33 నిమిషాల్లో కారులో 10 నుండి 80 శాతం వరకు, 50kW ఫాస్ట్ ఛార్జర్‌తో సుమారు 2.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది.

418km పరిధితో, ఎక్స్‌సీ40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ "ట్విన్" వెర్షన్‌లో అందుబాటులో ఉంది, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408hp , 660Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్‌తో నడిచే XC40 కంటే దాదాపు రెండు రెట్లు శక్తివంతమైందనీ, లగ్జరీ ఆడి ఇ-ట్రాన్ 55 క్వాట్రో పోలి ఉందని భావిస్తున్నారు.

55.90 లక్షల ధరతో, XC40 రీఛార్జ్ ఒకవైపు మినీ కూపర్ ఎస్‌ఈ,  BMW i4 , Kia EV6 వంటి లగ్జరీ ఈ-కార్లకు గట్టిపోటి ఇస్తుందని అంచనా. 

మరిన్ని వార్తలు