ట్రాఫిక్‌ సమస్యకి చెక్‌.. జుయ్‌మంటూ ఎగిరే బైకులు రాబోతున్నాయ్‌!

18 Sep, 2022 19:36 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో నగరవాసులకు అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్‌ జామ్‌. దీని వల్ల వాళ్ల సమయం వృథా కావడంతోపాటు వారి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇక సిటీ లైఫ్‌లో ట్రాఫిక్‌ సమస్య కూడా ఓ భాగమే అనుకుని ప్రజలు ముందుకు సాగిపోతున్నారు. అయితే త్వరలో ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చట. ఎలా అంటారా.. జపనీస్ కంపెనీ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది. ఇటీవలే ఆ బైక్‌ను మీడియా ముందు ప్రదర్శించింది.

జుయ్‌మంటూ వచ్చేస్తోంది ఎగిరే బైక్‌..
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్. దీనికి XTURISMO hoverbike అని పేరు పెట్టారు. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్‌( AERWINS) టెక్నాలజీస్ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ బైక్ గురువారం యునైటెడ్ స్టేట్స్‌లోని డెట్రాయిట్ నందు జరిగిన ఆటో షోలో  ప్రదర్శించారు. 

ఈ హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ సినిమాలోని బైక్‌లతో పొలిక ఉండడంతో అందరినీ ఆకర్షించింది. ఈ బైక్‌ గరిష్టంగా 100 kph (గంటకు 62 మైళ్లు) వేగంతో 40 నిమిషాల పాటు ప్రయాణించగలదు.ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుంది. జపాన్‌లో ఇప్పటికే ఈ బైక్‌లు అమ్మకంలో ఉన్నాయి.

ప్రస్తుతం కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా  ఉంది. ఈ హోవర్‌బైక్ ధర $7,77,000 (భారత కరెన్సీ ప్రకారం 6 కోట్లు) ఉంటుంది. అయితే కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ మోడల్ ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకోసం కంపెనీకి మరో 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు.
 

చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!

మరిన్ని వార్తలు