స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను! ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతుంది?

25 Apr, 2022 08:11 IST|Sakshi

ముంబై: ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ ముగింపుతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా స్టాక్‌ సూచీలు ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. కోవిడ్‌ కేసులు, ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ పరిణామాల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదిలికలపై ఇన్వెస్టర్లు కన్నేయొచ్చని తెలిపారు.

‘‘జాతీయ, అంతర్జాతీయంగానూ సెంటిమెంట్‌ బలహీనంగానే ఉంది. ద్రవ్య పాలసీపై ఫెడ్‌ రిజర్వ్‌ కఠిన వైఖరిని కలిగింది. బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆగడం లేదు. క్రూడాయిల్‌ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల వరుస విక్రయాలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపొచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి సాంకేతికంగా 17,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 16,800 వద్ద మద్దతు లభించొచ్చు. స్వల్పకాలంలో మార్కెట్‌ స్థిరీకరించుకునే అవకాశాలు ఎక్కువ’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనుందనే ఆందోళనలతో గతవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. వారం మొత్తంగా 1,142 పాయింట్లు, నిఫ్టీ 304 పాయింట్లు చొప్పున క్షీణించాయి.   

మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు...

కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాల ప్రభావం  
ముందుగా నేడు మార్కెట్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్‌ క్యూ4 గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక వారంలో సుమారు 160కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందుస్థాన్‌ యూనిలివర్, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్, యాక్సిస్‌ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్, విప్రో, మారుతీ సుజుకీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.  

ద్రవ్యోల్బణం, బాండ్లపై రాబడులు  
అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈక్విటీ మార్కెట్లను కలవరపెడుతోంది. ఇప్పటికే అమెరికాతో సహా బ్రిటన్, భారత్‌లో ద్రవ్యోల్బణ రికార్డు స్థాయికి చేరినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆయా దేశాల్లో ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు ఉలికిపడుతున్నాయి.   

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు  
విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఏప్రిల్‌లో రూ.15,867 కోట్ల షేర్లను, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి వరకు రూ.1,32,529 కోట్ల షేర్లను విక్రయించారు.

రెండు ఐపీవోలు..  
ఈ వారంలో రెండు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఫుట్‌వేర్‌ కంపెనీ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం(ఈ నెల 26న) ప్రారంభం అవుతుంది. ఇష్యూ గురువారం ముగిస్తుంది. మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్‌ చెయిన్‌ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ ఐపీవో ఏప్రిల్‌ 27న(బుధవారం) ప్రారంభమై 29న(శుక్రవారం) ముగుయనుంది. దీని ద్వారా సంస్థ రూ. 2,000 కోట్లు సమీకరించనుంది.  

గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు  
ఈ గురువారం(ఏప్రిల్‌ 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఏప్రిల్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్‌ ఆఫ్‌ లేదా రోలోవర్‌ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్‌ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.   

మార్చిలో పీనోట్‌ పెట్టుబడులు: 87,979 
పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడులు గత నెలలో రూ. 87,979 కోట్లకు క్షీణించాయి. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లుగా నమోదయ్యాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో రానున్న నెలల్లో లిక్విడిటీ తగ్గనుందని, దీంతో పీనోట్ల ద్వారా పెట్టుబడులపై ఒత్తిడి పెరగనుందని సెబీ రిజిస్టర్డ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసుల సంస్థ గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్‌ శర్మ తెలియజేశారు. అయితే ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు భారత్‌తో వాణిజ్య భాగస్వామ్యాలకు ఆసక్తి చూపిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఇన్వెస్టర్లకు రిజిస్టర్డ్‌ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. తద్వారా దేశీ స్టాక్‌ మార్కెట్లలో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు రిజిస్టర్‌కాకుండానే ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంటుంది. సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌ సెక్యూరిటీలలో పీనోట్ల ద్వారా మార్చి చివరికల్లా రూ. 87,979 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు