WEF: పర్యాటక రంగాన్ని వీడని పరేషాన్‌

24 May, 2022 14:30 IST|Sakshi

దావోస్‌లో జరుగుతున్న వలర్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సుపై అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ కుదురుతున్న వివిధ వ్యాపార ఒప్పందాలతో పాటు పలు కీలక అంశాలపై వెలువడుతున్న నివేదికలపై ఆసక్తి నెలకొంది. కాగా పర్యాటక రంగంపై విడుదలైన వివేదిక మరోసారి ధనవంత దేశాలకే పట్టం కట్టింది. 117 దేశాలకు సంబంధించిన సమాచారంతో ఈ ఇండెక్స్‌ తయారు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోవడంతో క్రమంగా టూరిజం ఊపందుకుంటోంది. అయితే ఇప్పటికీ కోవిడ్‌ ముందు పరిస్థితికి ఇంకా చేరుకోలేదు. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది పరిస్థితులు మెరుగుపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ ఉండగా ధనిక దేశాల్లో మాత్రం త్వరగా పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. తాజా టూరిజం ఇండెక్స్‌ ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ విడుదల చేసిన ట్రావెల్‌, టూరిజం డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో జపాన్‌ నిలిచింది. మిగిలిన తొమ్మిది స్థానాలు ఏషియా, యూరప్‌, అమెరికా ఖండాల్లో ధనవంతదేశాలకే దక్కాయి. టాప్‌ టెన్‌లో స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఇటలీ, యూకే మొత్తం ఆరు దేశాలు స్థానం దక్కించుకున్నాయి. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఏషియా నుంచి జపాన్‌ తర్వాత సింగపూర్‌ 9వ స్థానంలో నిలిచింది.

భారత్‌ విషయానికి వస్తే కోవిడ్‌ ముందు పరిస్థితితో పోల్చితే భారత్‌లో టూరిజం రికవరీ ఆశించినంత వేగంగా లేదు. తాజా ఇండెక్స్‌లో 4.5 పాయింట్లు సాధించి ఇండియా 54వ స్థానంలో నిలిచింది. కోవిడ్‌ ముందుతో పోల్చితే  8 స్థానాలు కిందికి పడిపోయింది. ఏషియా స్థాయిలో జపాన్‌, సింగపూర్‌లు ఆధిక్యం చూపితే.. దక్షిణాసియాలో ఇండియానే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ

మరిన్ని వార్తలు