ట్యాక్స్ రిఫండ్‌ ఇంకా రాలేదా..?

24 May, 2021 14:12 IST|Sakshi

ఒక అసెస్సీ తన నికర ఆదాయం మీద చెల్లించాల్సిన పన్ను కన్నా ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే అలా ఎక్కువగా చెల్లించిన మొత్తాన్ని రిఫండుగా వెనక్కి ఇస్తారు. అంతే కాదు. రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. అసెస్సీలే కాదు.. అసెస్సీ పరిశీలకులు, సంరక్షకులు, ప్రతినిధి కూడా రిఫండును క్లెయిమ్‌ చేయొచ్చు. సాధారణంగా దాఖలు చేసిన రిటర్నుని అధికారులు అసెస్‌.. అంటే మదింపు చేస్తారు. అలా పూర్తి చేసిన తర్వాత రిఫండు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే రిఫండ్‌ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అప్పీలులో పన్ను భారం తగ్గవచ్చు. అప్పుడు కూడా రిఫండు ఇస్తారు. ఇలా సకాలంలో ఇవ్వకపోయిన పక్షంలో రిఫండుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తారు.

  • టీడీఎస్, అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్‌ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. 
  • బేసిక్‌ లిమిట్‌ కంటే స్థూల నికర ఆదాయం తక్కువ ఉంటే ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయనవసరం లేదు. కానీ చెల్లించిన పన్ను మొత్తం ఉంటే రిఫండు కోసం రిటర్ను దాఖలు చేయాలి. రిఫండు అనేది ఆటోమేటిక్‌గా రాదు. రిటర్ను దాఖలు చేయాలి. 
  • అన్ని రకాలుగా మీ క్లెయిమ్‌ కరెక్టుగా ఉంటే రిఫండు త్వరగానే వచ్చేస్తుంది. 
  • 2021 మార్చి 31 నాటికి 2,38,000 మందికి రూ. 2.62 లక్షల కోట్ల రిఫండులు ఇచ్చారు. 
  • ఈ ఏడాది ఏప్రిల్‌ 21 నుంచి మే 10 మధ్య కాలంలో 13 లక్షల మందికి రూ. 17,061 కోట్లు రీఫండులు జారీ చేశారు. అయితే, ఈ కింది పరిస్థితుల్లో రిఫండు రాకపోవచ్చు. 
  • మదింపు ఇంకా జరగకపోతే 
  • రిటర్ను వెరిఫై కాకపోతే .. అంటే 120 రోజుల్లోపల పంపాల్సిన ఫారం V పంపకపోతే 
  • మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఇవ్వకపోయినా లేక వివరాలు సరిపోలకపోయినా
  • మీరు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి మీ ఆదాయపు పన్ను స్టేటస్‌ చెక్‌ చేసుకోవాలి. రిటర్ను వేసేటప్పుడు వాడుకలో ఉన్న మీ వ్యక్తిగత మెయిల్‌ వివరాలే ఇవ్వండి. అంతా ఆన్‌లైన్‌ యుగం. గతంలో లాగా పోస్ట్‌మ్యాన్‌ తలుపు తట్టి తాఖీదు ఇవ్వరు. ఒకవేళ నోటీసులేమైనా వస్తే ఆన్‌లైన్‌ మాధ్యమంలో సకాలంలో జవాబు పంపించండి. మీ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ గుర్తు పెట్టుకోండి. ఎవరితోనూ షేర్‌ చేయొద్దు. ఒక సంవత్సరకాలంగా రిఫండు రావాల్సి ఉండి.. ఇతరత్రా మరో సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను భారం ఉంటే దానికి అడ్జస్టు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో నోటీసులు ఇస్తారు. సక్రమంగా, సకాలంలో స్పందించండి. ఆదాయపు పన్ను శాఖ రిఫండు విషయంలో మెరుగైన సరీ్వసులు అందిస్తోంది. 

ట్యాక్సేషన్‌ నిపుణులు:
కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూరి
కె.వి.ఎన్‌ లావణ్య

మరిన్ని వార్తలు