వాట్సాప్‌పై ఆరోపణలను తోసిపుచ్చిన సీసీఐ

19 Aug, 2020 17:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో ప్రబలశక్తిగా ఎదిగేందుకు వాట్సాప్‌ తన ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తోందని ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌పై నమోదైన కేసును కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) బుధవారం తోసిపుచ్చింది. వాట్సాప్‌ ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్‌ పేమెంట్‌ వేదిక వాట్సాప్‌ పేను ప్రస్తుత యూజర్లు వాడుకోవాలని వారిపై ఒత్తిడి చేస్తోందంటూ మెసేజింగ్‌ యాప్‌పై సీసీఐలో ఈ ఏడాది మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసును పరిశీలించిన మీదట వాట్సాప్‌ యాంటీట్రస్ట్‌ చట్టాలను ఉల్లంఘించినట్టు గుర్తించలేదని సీసీఐ స్పష్టం చేసింది.

వాట్సాప్‌ పే సర్వీసును పూర్తిస్ధాయిలో ప్రారంభించనందున మార్కెట్‌లో కంపెనీ ప్రవర్తనను ఇప్పుడే అంచనా వేయలేమని పేర్కొంది. భారత్‌లో వాట్సాప్‌ యూజర్లందరిలో కేవలం 1 శాతానికే వాట్సాప్‌ పే బీటా వెర్షన్‌ అందుబాటులో ఉందని సీసీఐ జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. వాట్సాప్‌ పేను త్వరలో పూరిస్తాయిలో తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్న వాట్సాప్‌కు సీసీఐ ఉత్తర్వులు ఊరట కల్పించాయి. మరోవైపు మెసేజింగ్‌ సర్వీస్‌ను వాడుకునేందుకు తమ యూజర్లు వాట్సాప్‌ పేను రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని సీసీఐకి వాట్సాప్‌ వివరణ ఇచ్చింది. ఇక వాట్సాప్‌ పేమెంట్‌ సీర్వసుల విస్తరణను సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులను సుప్రీంకోర్టు విచారిస్తోంది. చదవండి : ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు ధీటుగా ‘బిగ్రాఫి’

>
మరిన్ని వార్తలు