3 మిలియన్ల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్!

3 Sep, 2021 17:19 IST|Sakshi

ఈ ఏడాది జూన్ - జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి, సురక్షితమైన యూజర్ అనుభవాన్ని అందించడం కోసం ఖాతాలను నిషేదించినట్లు వాట్సాప్ పేర్కొంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇండియా గ్రీవియెన్స్ ఆఫీసర్ నుంచి అందుకున్న మెయిల్స్ ఆధారంగా ఈ మెసేజింగ్ ఫ్లాట్ ఫారంలో హానికరమైన సమాచారాన్ని అరికట్టడం కోసం ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా ఖాతాలను నిషేదించింది. (చదవండి: Work From Home: కంపెనీల అనూహ్య నిర్ణయం)

కొత్త ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా వాట్సాప్ తన యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ బయటకు విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 16 - జూలై 31 మధ్య 46 రోజుల వ్యవధిలో వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా, అలాగే తన స్వంత టూల్స్ గుర్తించిన స్పామ్ గల 3.027 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ పేర్కొంది. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్‌ యాజమాన్యం పేర్కొంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తప్పుడు సందేశాల వ్యాప్తికి కారణమవుతున్న ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏదైనా గ్రీవియెన్స్ కోసం మమ్మల్ని సంప్రదించాలంటే యూజర్లు wa@support.whatsapp.comకు ఈ-మెయిల్ చేయవచ్చు అని తెలిపింది.

మరిన్ని వార్తలు