ఏడాది కాలంలో రికార్డ్‌ స్థాయిలో పెరిగిన సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్‌ ధరలు..ఎందుకంటే!

18 Apr, 2022 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ గ్యాస్‌ వినియోగ ధోరణులపై సిటీ గ్యాస్‌ పంపిణీదారుల (సీజీడీ) నుంచి డేటా కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాక కేటాయింపులు జరుపుతామని కేంద్ర చమురు శాఖ వర్గాలు వెల్లడించాయి. 

సాధారణంగా డిమాండ్‌ను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి (ఏటా ఏప్రిల్, అక్టోబర్‌లో) కేంద్రం గ్యాస్‌ కేటాయింపులు చేస్తుంది. కానీ 2021 మార్చి నుంచి ఇప్పటివరకూ కేటాయించలేదు. దీనితో కొరతను అధిగమించేందుకు సిటీ గ్యాస్‌ ఆఫరేటర్లు ..దిగుమతి చేసుకున్న ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ను అధిక రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా సీఎన్‌జీ రేటు కేజీకి రూ. 28 పైగా, పీఎన్‌జీ ధర మూడో వంతు మేర పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మరోవైపు, సీజీడీ సంస్థలు తమకు త్రైమాసికాలవారీగా కేటాయించాలంటూ అభ్యర్ధించాయని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చమురు శాఖ ప్రతినిధి తెలిపారు. సీజీడీ అదనపు కేటాయింపులు జరపాలంటే .. ఎరువులు, విద్యుత్, ఎల్‌పీజీ ప్లాంట్లు మొదలైన వాటికి సరఫరాలో కోత పెట్టాల్సి వస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు