ట్రూజెట్‌లో విన్‌ఎయిర్‌కు మెజారిటీ వాటాలు

2 May, 2022 05:08 IST|Sakshi
టర్బో మేఘా ఎండీ ఉమేష్‌ వంకాయలపాటి (ఎడమ), విన్‌ఎయిర్‌ సీఎండీ శామ్యూల్‌ తిమోతీ   

79 శాతం వాటాను రూ. 200 కోట్లకు కొనుగోలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా తొలి సమాంతర విమానయాన సంస్థ విన్‌ఎయిర్‌ తాజాగా ట్రూజెట్‌లో 79 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద విలువ రూ. 200 కోట్లు. డీల్‌ ప్రకారం ట్రూజెట్‌ నిర్వహణ నియంత్రణ, కార్యకలాపాలను విన్‌ఎయిర్‌ (ఉయ్‌ ఇండియన్‌ నేషనల్స్‌) టేకోవర్‌ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ఎండీ ఉమేష్‌ వంకాయలపాటి, విన్‌ఎయిర్‌ సీఎండీ శామ్యూల్‌ తిమోతీ సంతకాలు చేశారు. దీని ప్రకారం ఉమేష్‌ ఎండీగా కొనసాగనుండగా, నూతన మేనేజ్‌మెంట్‌ టీమ్‌కు కొత్త వ్యాపార ప్రణాళికతో తిమోతీ దిశా నిర్దేశం చేయనున్నారు.

ఈ ఒప్పందంతో ట్రూజెట్‌ 650 మంది పైగా ఉద్యోగులు, వారి కుటుంబాలకు స్వాంతన చేకూరనుంది. మీడియా, రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాల్లో ఉన్న ఆర్యన్‌ గ్రూప్‌ కంపెనీస్‌లో విన్‌ఎయిర్‌ కూడా భాగంగా ఉంది. డిసెంబర్‌ ఆఖరు నాటికి రోజూ 17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 3 బ్యాకప్‌ విమానాలతో ట్రూజెట్‌ సర్వీసులు నిర్వహించగలదని తిమోతీ తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆపరేటింగ్‌ పర్మిట్లు మొదలైనవన్నీ ఉన్న ఎయిర్‌లైన్స్‌ నుంచి విమానాలను వాటి లైసెన్సులతో పాటు లీజుకు తీసుకుని లాభసాటి రూట్లలో నడిపించుకునే సంస్థను సమాంతర (ప్యారలల్‌) ఎయిర్‌లైన్‌గా వ్యవహరిస్తారు.  

మరిన్ని వార్తలు