ముడిచమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు.. జనవరి 3 నుంచి అమలు

4 Jan, 2023 20:22 IST|Sakshi

దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, ఎగుమతి చేసే డీజిల్, ఏటీఎఫ్‌లపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను టన్నుకు రూ. 1,700 నుంచి రూ. 2,100కి పెంచింది. అలాగే ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరుకు పన్నును రూ. 5 నుంచి రూ. 6.5కి, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై లీటరుకు రూ. 1.5 నుంచి రూ. 4.5కి పెంచింది.

కొత్త ట్యాక్స్‌ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) తదితర సంస్థలు దేశీయంగా క్రూడాయిల్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆయిల్‌ రేట్ల పెరుగుదలతో చమురు కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధిస్తున్న పన్నును విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలోనే ఈ ఏడాది జూలై 1 నుంచి భారత్‌ కూడా దీన్ని అమలు చేయడం ప్రారంభించింది. ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తోంది.  అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్లు తగ్గడంతో డిసెంబర్‌ 16న చివరిసారిగా జరిపిన సమీక్షలో ట్యాక్స్‌ రేటును కొంత తగ్గించింది. పెట్రోల్‌ ఎగుమతులకు మాత్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఉంటోంది.

చదవండి: iPhone 14: వావ్‌ ఐఫోన్‌ పై మరో క్రేజీ ఆఫర్‌! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!


 

మరిన్ని వార్తలు