విండ్‌ఫాల్‌ టాక్స్ మూడు రెట్లు కోత: ఇక జాలీగా విమానాల్లో!

16 Dec, 2022 16:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ఆయిల్‌ రంగ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. పక్షం రోజుల సమీక్షలో భాగంగా దేశీయ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి లాభాలపై విండ్‌ఫాల్‌  టాక్స్‌ను భారీగా తగ్గించింది. జెట్‌ ఇంధనం (ఏటీఎఫ్‌), డీజిల్‌ ఎగుమతులపై కూడా విండ్‌ఫాల్‌ టాక్స్‌ను  తగ్గించింది.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, దేశీయంగా ఉత్పత్తి  అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ సెస్ టన్నుకు రూ. 4,900 నుంచి  రూ.1,700కు తగ్గించింది. జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విధించే విండ్‌ఫాల్ పన్నును మూడు రెట్లు తగ్గించి  లీటరుకు రూ. 5 నుండి రూ. 1.5 కు కోత విధించింది. డీజిల్ ఎగుమతిపై సెస్ లీటర్‌కు రూ. 8 నుండి రూ. 5 కు తగ్గించింది. కేంద్రం పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని జీరో శాతం వద్దే ఉంచింది.  సవరించిన రేట్లు అన్నీ డిసెంబర్ 16, 2022 నుండి అమల్లో ఉంటాయి.  (వావ్‌..ఇంత తక్కువ ధరలో యాపిల్‌ ఐఫోన్‌!)

భారతదేశంలో విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులో ఇంధన ఖర్చే 30-40 శాతం దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో  తాజా విండ్‌ఫాల్‌ టాక్స్‌ కోత వాటి లాభాల మార్జిన్‌లను పెంచుతుంది.  దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు దిగి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.  2022 నవంబరు నుంచి దాదాపు 15  శాతం గ్లోబల్ క్రూడ్ ధరలు క్షీణిస్తున్న సమయంలో ఈ తగ్గింపు వచ్చింది. 

కాగా జూలై 1, 2022 నుంచి ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగిన కారణంగా చమురు కంపెనీలు పొందిన లాభాలను దృష్టిలో ఉంచుకుని, చమురు ఉత్పత్తిపై, అలాగే గ్యాసోలిన్, డీజిల్ , విమాన ఇంధనాల ఎగుమతులపై విండ్‌ఫాల్‌ టాక్స్‌  ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు రెండు వారాలకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం సవరిస్తోంది.
 

మరిన్ని వార్తలు