Windows 11: వచ్చిందోచ్‌.. మీ కంప్యూటర్‌ సపోర్ట్‌ చేస్తుందా?

5 Oct, 2021 11:04 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులకు శుభవార్త ! మైక్రోసాఫ్ట్‌ సంస్థ సరికొత్త అప్‌డేట్‌ విండోస్‌ 11ని విడుదల చేసింది. ఉచితంగానే ఈ సరికొత్త వెర్షన్‌ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇండియాలోని వినియోగదారులకు మైక్రోసాప్ట్‌ అందుబాటులోకి తెచ్చింది. 

అనువుగా ఉందా ?
ప్రస్తుతం విండోస్‌ 10 వెర్షన్‌పై పని చేస్తున్న ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లే విండోస్‌ 11 వెర్షన్‌పై పని చేయడానికి అనువుగా ఉన్నాయి. అయితే ఇందులో కూడా అన్ని విండోస్‌ 11కి కాంపాటిబుల్‌ కావు. పీసీ హెల్త్‌  చెకప్‌ వంటి యాప్‌ల ద్వారా మన దగ్గరున్న ల్యాపీ లేదా పీసీ విండోస్‌ 11 వెర్షన్‌కి అనువుగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. 

ఇలా పొందండి
కంప్యూటర్‌ లేదా ‍ల్యాప్‌టాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అక్కడున్న విండోస్‌ అప్‌డేట్‌లో అప్‌డేట్‌పై క్లిక్‌ చేయాలి. సిస్టమ్‌ అప్‌డేట్‌కి అనువుగా ఉంటే అక్కడ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేస్తే.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి

ముఖ్యమైన ఫీచర్లు
మైక్రోసాఫ్ట్‌ చెబుతున్నదాని ప్రకారం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో చాలా మార్పులు జరిగాయి. అదే విధంగా పెర్ఫామెన్స్‌ కూడా మెరుగ్గా ఉంటుంది. టాస్క్‌బార్‌, స్టార్ట్‌ బటన్‌లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.విండోస్‌ 8 నుంచి వస్తోన్న లైవ్‌ టైటిల్స్‌ ఆప్షన్‌ని తొలగించారు. యూఐలో  క్విక్‌ యాక‌్షన్స్‌కి చోటు కల్పించారు. మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ యాప్‌, డైరెక్ట్‌ స్టోరేజీ, ఆటో హెచ్‌డీఆర్‌ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్తవన్నీ 11 పైనే
ఇప్పటికే ఆసూస్‌, హెచ్‌పీ, లెనోవాల నుంచి త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న ల్యాప్‌టాప్‌, పర్సనల్‌ కంప్యూటర్లకు ఇప్పటికే విండోస్‌​ 11ని అందించినట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. అతి త్వరలోనే ఏసర్‌, డెల్‌లు కూడా ఈ జాబితాలో చేరుతాయని  ఆ సంస్థ ప్రకటించింది.
చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్‌ ఫేస్‌బుక్‌ ట్రెండ్‌! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్‌, టెలిగ్రామ్‌

మరిన్ని వార్తలు