విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: ఫిబ్రవరి జీతాలతో పండగే! 

16 Feb, 2023 15:49 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా గ్లోబల్‌గా  దిగ్గజ కంపెనీల్లో సైతం ఉద్యోగాల కోత ప్రకంపనలు పుట్టిస్తున్న తరుణంలో  విప్రో  కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వేరియబుల్ పే  అందించనుంది. థర్డ్ క్వార్టర్‌లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేయనున్నామని అంతర్గత ఇమెయిల్‌లో ఉద్యోగులకు తెలిపింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ఫిబ్రవరి నెల జీతంతో విడుదల చేయనుంది. 

విప్రో 2022-23 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో A నుండి B3 బ్యాండ్‌లలోని ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్‌ను విడుదల చేయనున్నట్లు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు ఈ మెయిల్  సమాచారం అందించారు. A నుంచి B3 లెవెల్ ఉద్యోగులు, అన్ని సపోర్ట్ ఫంక్షన్స్‌లో పనిచేసే సిబ్బందికి ఐటీ కంపెనీ పెర్ఫామెన్స్ పనితీరు ఆధారంగా 87శాతం వేరియబుల్ పే చెల్లించనుండగా.. మేనేజర్ స్థాయి, అంతకుమించి లెవెల్ ఉద్యోగులకు.. బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారిత వేరియబుల్ పే చెల్లించనుంది.అందరు ఉద్యోగులు అంటే ఇందులో ఫ్రెషర్స్ కూడా  ఉంటారు.

కాగా రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం,ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఏకీకృత ఆదాయం 14.3 శాతం పెరిగి రూ.23,229 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 16.3 శాతం పెరుగుదల నమోదు చేసింది. అయితే గత త్రైమాసికంలో విప్రో 100 శాతం వేరియబుల్ పే ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు