అతిగా ఫోన్‌ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!

25 Feb, 2023 12:08 IST|Sakshi

అతిగా ఫోన్‌ వాడకం ఓ మహిళను వీల్‌చైర్‌కు పరిమితం చేసింది. యూకేకి చెందిన 29 ఏళ్ల ఫెనెల్లా ఫాక్స్‌ వర్టిగో అనే వ్యాధి బారినపడింది. తాను సోషల్‌ మీడియాలో స్క్రోలింగ్‌ చేస్తూ 14 గంటల పాటు నిరంతరంగా ఫోన్‌ వాడానని ది మిర్రర్ ‌వార్తా సంస్థకు ఆమె వివరించింది. ఐప్యాడ్, ఐఫోన్‌లలో గంటలకొద్దీ గడపడం తనకు భారీ చేటును కలిగించిందని, వెర్టిగో వ్యాధితో మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఫాక్స్‌ పోర్చుగల్‌లో ఉన్నప్పుడు తలనొప్పి, మైకం వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయి. 2021 నవంబర్ నాటికి అవి తీవ్రమయ్యాయి. ‘నేను నిజంగా సరిగ్గా నడవలేనట్లు అనిపించింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. అప్పటి పరిస్థితి నాకు బాగా గుర్తుంది. కానీ ఎక్కువగా వివరించలేను. ఈ అనర్థాలకు కారణం నా ఫోన్‌ అని అప్పుడు నాకు తెలియదు. ఇది కోవిడ్‌ లాంటిదే. నేను వంట చేయలేకపోయాను. ఇంటికి చేరుకోవడానికి వీల్‌చైర్ కావాల్సివచ్చింది. నా తల్లిదండ్రులు నన్ను చూసుకోవాల్సి వచ్చింది. దాదాపు ఆరు నెలల పాటు ఆ పరిస్థితి అనుభవించాను’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.

(ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్‌ దిగ్గజం.. ఎస్‌ఎంఈలకు సరికొత్త వేదిక) 

ప్రస్తుతం ఫెనెల్లా ఆరోగ్యం మెరుగుపడిందని, ఇకపై వీల్‌చైర్ అవసరం ఉండదని ఆమె ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే తన ఫోన్‌ను ముందులాగే గంటలకొద్దీ ఉపయోగిస్తే మళ్లీ ఆ ఘోర పరిస్థితులు తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదు.

మరిన్ని వార్తలు