మరికొన్ని గంటలు అదనంగా పనిచేయండి.. ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ రిక్వెస్ట్‌!

19 Feb, 2023 13:17 IST|Sakshi

గూగుల్‌ రూపొందించిన బార్డ్ ఏఐ చాట్‌బాట్‌లో లోపాలను సరిచేసేందుకు ఆ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సరికొత్త ప్రణాళికను రచించింది. ఇందుకోసం వారంలో కొన్ని గంటలు అదనంగా పనిచేయాలని గూగుల్‌ ఉద్యోగులను సీఈవో సుందర్ పిచాయ్ కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపినట్లు తెలిసింది.  బార్డ్ ఏఐ చాట్‌బాట్‌లో లోపాలను గుర్తించి సరిచేయడానికి వారానికి రెండు నుంచి నాలుగు గంటలు కేటాయించాలని కోరారు.

బిజినెస్‌ ఇన్‌సైడర్‌ కథనం ప్రకారం.. వేలాది మంది గూగుల్‌ ఉద్యోగులు ఇప్పటికే బార్డ్ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తూ పరీక్షిస్తున్నారని, ఇందులో సమస్యలన్నంటినీ పరిష్కరించడానికి ఒక కొత్త ప్లాన్‌ను రూపొందించినట్లు సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. ఇందు కోసం వేలాదిమంది ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక ఎటాంటి లోపాలు ఉండకూడదన్నది గూగుల్‌ ఉద్దేశం. అయితే సుందర్‌ పిచాయ్‌ ప్రపంచవ్యాప్తంగా మొత్తం గూగుల్‌ ఉద్యోగులందరికీ ఈ సందేశాలను పంపించారా.. లేదా అన్నది స్పష్టత లేదు.

గత వారంలో డెమో సమయంలో బార్డ్ బాట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో నెగిటివ్‌ ప్రచారం బాగా జరిగింది. గూగుల్‌ ఇటీవల తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించిన విషయం తెలిసిందే.  మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌తో సంబంధం లేకుండా గూగుల్‌కు ప్రస్తుతానికి  ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 

సుందర్ పిచాయ్ పంపించిన సందేశాల్లో.. ఉద్యోగులందరూ బార్డ్‌ కోసం వారానికి రెండు నుంచి నాలుగు గంటలు అదనంగా, మరింత లోతుగా పనిచేసి లోపాలు సరిచేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్డ్‌ని పరీక్షించడానికి ఈ వారంలో గణనీయమైన సమయాన్ని కేటాయించాలని ఈ-మెయిల్స్‌లో  పిచాయ్ అభ్యర్థించారు.

(ఇదీ చదవండి: రిషి సునాక్‌, బిల్‌గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన చాట్‌బాట్‌.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?)

మరిన్ని వార్తలు